పాక్ స్టార్ హోటల్లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యం
గ్వదార్ (పాకిస్తాన్): పాకిస్తాన్లోని ఓ స్టార్హోటల్లోకి చొరబడి దాడులు చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదేశ భద్రతాదళాలు మట్టుబెట్టాయి. గ్వదార్లో ఉన్న ఈ ఫైవ్ స్టార్ హోటల్లోకి చొరబడటంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. కొన్ని గంటల పాటు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ బలగాలు తెలిపాయి. స్థానిక కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఈ ఉగ్రమూకలు పెరల్ కాంటినెంటల్ హోటల్లోకి చొరబడ్డారు.
భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగకముందు హోటల్ గదుల్లో ఉన్న అతిథులను, ఎక్కువగా చైనా దేశస్తులను ఖాళీ చేయించినట్లు బలోచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జహూర్ బలేది చెప్పారు. ఈ ఎదురుకాల్పుల్లో పాక్ ఆర్మీ మరియు నేవీ జవాన్లు పాల్గొని కొన్ని గంటల పాటు కాల్పులు జరిపినట్లు ఆయన చెప్పారు. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ఆపరేషన్ ముగిసినట్లు జహూర్ బలేది తెలిపారు. ఈ ఉగ్రవాదులు నిషేధిత బలోచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినవారని పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పాకిస్థాన్ పై మరోసారి ఉగ్రదాడి : ఫైవ్ స్టార్ హోటల్ పై అటాక్, కొనసాగుతున్న కాల్పులు
ఇదిలా ఉంటే అత్యంత భద్రత కలిగిన పరెల్ కాంటినెంటల్ హోటల్లోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తుండగా వారిని ఆ హోటల్ సెక్యూరిటీ గార్డు అడ్డుకునే ప్రయత్నం చేశాడని అయితే అతన్ని అక్కడే ఈ ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు పాక్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది.అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం కానీ హోటల్లో ఉన్నవారికి గాయాలు అయినట్లు కానీ జరగలేదని ప్రభుత్వం ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం గ్వదార్లో 14 మందిని కొందరు ఉగ్రవాదులు చంపారు. ఇందులో 11 మంది ఆదేశ జవాన్లు ఉండటం విశేషం. ఆ ఘటన మరువక ముందే మళ్లీ గ్వదార్లో ఉగ్రవాద కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.