డొనాల్డ్ ట్రంప్-కిమ్ జోంగ్ ఉన్ భేటీకి వేదిక, తేదీ ఖరారు
వాషింగ్టన్: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చరిత్రాత్మక భేటీకి ముహూర్తంతోపాటు వేదిక కూడా ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వచ్చే జూన్ 12న సింగపూర్లో సమావేశం కానున్నారు.
ఉత్తర కొరియా పర్యటన ముగించుకొని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్వదేశానికి చేరుకున్న కొన్ని గంటల్లోనే ట్రంప్ గురువారం స్వయంగా ఈ వివరాలను ప్రకటించడం గమనార్హం.
కిమ్తో తన భేటీ విజయవంతమవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్-కిమ్ భేటీలో ప్రధానంగా అణ్వస్త్రరహిత కొరియా సాధనపై చర్చ జరగనుంది. ఉత్తర కొరియా అణ్వాయుధాలను త్యజించాలని అమెరికా చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి గమనార్హం. కాగా, సమావేశపు అజెండాపై ఉత్తర కొరియా మాత్రం పెదవి విప్పలేదు.
అయితే, తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఉత్తరకొరియా డిమాండ్ చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధినేతల మధ్య జరగనున్న తొలి భేటీ ఇదే కానుండటం గమనార్హం. ట్రంప్-కిమ్ భేటీకి వేదికగా కొరియా సరిహద్దుల్లోని సైనికరహిత ప్రాంతం, మంగోలియాలను కూడా అమెరికా అధికారులు పరిశీలించారు. సింగపూర్వైపే చివరకు మొగ్గుచూపారు.