భయపడిందే జరుగుతోందా?: జూలో పులికి సోకిన కరోనా: జంతువులకు సంక్రమిస్తోన్న వైరస్
న్యూయార్క్: ఏదైతే జరగకూడదని ఇన్నాళ్లూ కోరుకుంటూ వచ్చారో.. అదే ఆరంభమైనట్టు కనిపిస్తోంది. భూగోళాన్ని కమ్మేసిన కరోనా వైరస్.. ఇక జంతువులు, వన్యప్రాణులను కూడా వదిలిపెట్టట్లేదు. పెంపుడు జంతువులు, అడవి జంతవులకు కూడా ఈ వైరస్ సంక్రమించడమంటూ జరిగితే.. దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తింది. జూలో సంచరించే ఓ పెద్దపులికి కరోనా వైరస్ సోకింది.
డాక్టర్లను తరిమి కొట్టిన కాలనీలో 10 కరోనా పాజిటివ్ కేసులు: ఢిల్లీ మత ప్రార్థనలతో లింకు
న్యూయార్క్ జూలోని పెద్దపులికి వైరస్..
కరోనా వైరస్ బారిన పడి కొట్టుమిట్టాడుతోంది అమెరికా. పులి మీద పుట్ర అని పెద్దలు చెబుతుంటారే. ఆ అగ్రరాజ్యం అలాంటి దుస్థితినే ఎదుర్కొంటోంది. అమెరికాలోని ఓ జులాజికల్ పార్క్లోని పులికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు అధికారులు. పావుభాగం నగరం వరకు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న అమెరికా ఆర్థిక రాజధానిగా చెప్పుకొనే న్యూయార్క్లోని ప్రఖ్యాత బ్రాంక్స్ జూలో ఉంది ఈ పులి. కరోనా వైరస్ విజృంభణ మొదలైన తరువాత ఓ వన్యప్రాణిని పట్టి పీడించడం ఇదే తొలిసారి కావడం భయాందోళనలకు గురి చేస్తోంది.
27వ తేదీన అనారోగ్యానికి..
ఆ పెద్ద పులి పేరు నాడియా. వయస్సు నాలుగు సంవత్సరాలు. మలయన్ రకం జాతికి చెందిన పులి. నాడియాతో పాటు తోడబుట్టిన రెండు పులులు.. అజుర్, అముర్ సహా మరో మూడు ఆఫ్రికన్ సింహాలు ఈ నెల 27వ తేదీన అనారోగ్యానికి గురయ్యారు. ఈ మూగజీవాలు దగ్గుతో ఇబ్బంది పడ్డాయి. వెంటనే వాటికి వైద్య పరీక్షలను నిర్వహించారు. నాదియాకు అనస్తీసియాను ఇచ్చి రక్తాన్ని సేకరించామని, ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్గా తేలిందని జూ చీఫ్ వెటర్నరీ డాక్టర్ పాల్ క్యాల్లె తెలిపారు.
ధృవీకరించిన అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ..
నాడియా పులికి వైరస్ సోకిందనే విషయాన్ని అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ (యుఎస్డీఏ) అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం తాము అత్యంత గడ్డుకాలంలో ఉన్నామని, విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. వన్యప్రాణులు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉందని ఊహించలేకపోయామని జూ డైరెక్టర్ జిమ్ బ్రెహెనీ ఆవేదన వ్యక్తం చేశారు. నాడియా నుంచి వైరస్ తోటి ప్రాణులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
మూడు వారాల కిందటే జూ మూసివేసినా..
అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ మొదలైన కొద్ది రోజుల తరువాత బ్రాంక్స్ జూను మూసివేశారు అధికారులు, కిందటి నెల 16వ తేదీ నుంచి సందర్శకులకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ- పులికి వైరస్ ఎలా సంక్రమించిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన జూ సిబ్బంది నుంచి పులికి సంక్రమించి ఉంటుందనే అభిప్రాయాలు అధికారుల్లో వ్యక్తమౌతున్నాయి. జూ సిబ్బందిలో చాలామంది ఇప్పటికే విధులకు హాజరు కావట్లేదని చెబుతున్నారు.
జంతువుల నుంచి సంక్రమిస్తోందా?
జంతువుల నుంచి మనుషులకు లేదా తోటి వన్యప్రాణులకు కరోనా వైరస్ సోకుతుందా? లేదా? అనే విషయంపై సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ (సీడీసీ) అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు సోకినట్టుగానే జంతువుల నుంచి వన్యప్రాణులకు సంక్రమించే అవకాశమే ఉంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీడీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రాంక్స్ జూ ఘటన పట్ల సీడీసీ అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పెంపుడు జంతువుల నుంచి సంక్రమిస్తాయా?
వైరస్ సోకిన వారి నుంచి పెంపుడు జంతువులకు కరోనా సోకుతుందంటూ ఇదివరకు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిన విషయం తెలిసిందే. హాంగ్కాంగ్లో కొన్ని పెంపుడు జంతువులకు వైరస్ సోకినట్లు నిర్ధారించిన వార్తలను అక్కడి అధికారులు కొట్టేశారు. వైరస్ వల్ల అవి అనారోగ్యానికి గురి కాలేదని పేర్కొన్నారు. తాజాగా అటవీ జంతువులకు కూడా కరోనా వైరస్ సంక్రమిస్తుందనే విషయం స్పష్టమైంది. ఈ సరికొత్త పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.