భారీ ధరకు అమ్ముడైన టైటానిక్ చివరి ‘లంచ్ మెనూ’
న్యూయార్క్: సముద్రంలో మునిగిపోయిన టైటానిక్(నౌక)లో మొదటి తరగతి ప్రయాణికుల కోసం సిద్ధం చేసిన లంచ్ మెనూ కార్డు వేలంపాటలో అమ్ముడుపోయింది. ఓ ప్రైవేటు వ్యక్తి ఆన్లైన్ వేలంలో 88 వేల డాలర్ల(సుమారు రూ. 57లక్షలకుపైగా)కు దక్కించుకున్నాడు.
వేలం నిర్వాహాకులు లయన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్ స్పందిస్తూ.. ‘అనుకున్న విధంగానే వేలంలో ధర లభించింది. 14 ఏప్రిల్, 1912 తేదితో కూడిన మెనూ కార్డు.. షిప్ నిర్మాణ సంస్థ వైట్ స్టార్ లైన్ లోగోను కలిగి ఉంది' అని తెలిపారు.
కాగా, మెనులోని పదార్థాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రిల్డ్ మటన్ చాప్స్, కస్టర్డ్ ఫుడ్డింగ్. కార్న్డ్ బీఫ్. ఆవు, పంది మాంసంతో చేసిన పదార్థాలు. వేయించిన, ఉడకపెట్టిన బంగాళాదుంపలు, పలు రకాల చేప వంటకాలు, ఆపిల్ షేక్ అదేవిధంగా ఎనిమిది రకాల పన్నీరులు ఉన్నాయి.
లైఫ్ బోట్లో బయటపడ్డ అబ్రహం లింకన్ సాలమన్ అనే ఓ ప్రయాణికుడు దీనిని భద్రపరిచాడు. ఇతని వారసుడే గుర్తుతెలియని వ్యక్తి ద్వారా మెనూ కార్డును వేలానికి ఉంచినట్లుగా తెలిసింది.
10 ఏప్రిల్, 1912న టైటానిక్ ఓడ సౌతాంప్టన్ నుంచి బయల్దేరి అంట్లాంటిక్ సముద్రంలో నాలుగు రోజులు ప్రయాణించి 14 ఏప్రిల్, 1912న మంచు పర్వతాన్ని ఢీకొని మునిగిపోయిన విషయం తెలిసిందే. న్యూయార్క్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 1,500 మంది మృత్యువాతపడ్డారు.