యుద్ధం ఎవరైనా చేస్తారు..సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారు: ట్రంప్
సింగపూర్: కొత్త చరిత్ర సృష్టించేందుకు ఉత్తరకొరియా అమెరికా దేశాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. సింగపూర్లో కిమ్తో జరిగిన భేటీ అనంతరం ట్రంప్ మీడియాతో ముచ్చటించారు. కిమ్తో సమావేశం కొత్త చరిత్ర సృష్టిస్తుందని చెప్పిన ట్రంప్... నిన్నటి ఉద్రిక్తలు రేపటి యుద్ధానికి దారి తీయకూడదని అభిప్రాయపడ్డారు. యుద్ధం ఎవరైనా చేస్తారని... అయితే సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారని ట్రంప్ వివరించారు.
కిమ్తో సమావేశం సందర్భంగా పలు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేసుకున్నాయని చెప్పిన ట్రంప్... కిమ్ ఉత్తరకొరియాకు వెళ్లగానే జరిగిన ఒప్పందాల అమలుపై చర్యలు చేపడుతారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక అమెరికా అధ్యక్షుడు తమతో చర్చలకు ఆహ్వానించలేదని కిమ్ తనతో చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. గత అమెరికా అధ్యక్షులపై కిమ్కు అంతగా నమ్మకం ఉండేది కాదని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు.
త్వరలో అణు నిరాయుధీకరణ జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పిన ట్రంప్... ఉభయ కొరియా దేశాల ప్రజలు సామరస్యతతో జీవించాలని ఆకాంక్షించారు. క్షిపణి ప్రయోగా కేంద్రాలన్నిటినీ ధ్వంసం చేస్తామని కిమ్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ భేటీతో మార్పు సాధ్యమేనని నిరూపించామని చెప్పుకొచ్చిన ట్రంప్ ... త్వకలో కిమ్ జాంగ్ ఉన్ను శ్వేతసౌధానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తానని చెప్పారు. తను వైట్ హౌజ్కు తప్పకుండా వస్తానని కిమ్ చెప్పినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఉత్తరకొరియాను అద్భుతమైప భవిష్యత్తును కల్పించే అవకాశం కిమ్కు దక్కిందని ట్రంప్ చెప్పారు.
ఇప్పటి వరకు ఉత్తరకొరియాపై ఉన్న ఆంక్షలపై ట్రంప్ స్పందించారు. అణుక్షిపణులు ఇక ఉత్తరకొరియాలో లేవని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆ దేశంపై విధించిన ఆంక్షలకు స్వస్తి పలుకుతామని ట్రంప్ చెప్పారు. ఈ సమావేశం తర్వాత కొరియా తీరంలో అమెరికా మిలటరీ విన్యాసాలను నిలిపివేస్తుందని ట్రంప్ ప్రకటించారు. మొత్తానికి కిమ్తో సమావేశమవడం రెండు దేశాలకు శుభపరిణామమని ట్రంప్ పేర్కొన్నారు.