కరోనా ఎఫెక్ట్: దేశం కోసం పెళ్లిని 3సార్లు వాయిదా వేసుకున్న మహిళా ప్రధాని, 4వ సారి?
కోపెన్హగన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. లక్షలాది మంది ప్రాణాలు పోయాయి. అనేక వివాహాది శుభకార్యాలు వాయిదా పడ్డాయి. సామాన్య ప్రజలే కాదు.. ప్రముఖుల పెళ్లిళ్లు కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.
మూడుసార్లు వాయిదా పడిన పెళ్ళి..
తాజాగా డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడిక్సన్ వివాహం కూడా మూడోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని వెల్లడించారు. తన కాబోయే భర్త బోతో కలిసి ఉన్న ఫొటోను ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్లో పంచుకున్నారు.
అద్భుతమైన వ్యక్తితో..
‘ఈ అద్భుతమైన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. కానీ, అదంత సులభయ్యేలా కనిపించడం లేదు. జులైలో మేము వివాహం చేసుకుందామనుకున్నాం.. అయితే ఆ రోజే నేను బ్రస్సెల్స్లో ఓ ముఖ్యమైన సమావేశానికి హాజరుకావాల్సి ఉంది' అని ప్రధాని మెట్టె తెలిపారు.
దేశ క్షేమం కోసం తప్పదంటూ..
డెన్మార్క్ క్షేమం కోసం తాను తన కర్తవ్యాన్ని నిర్వహించాలని, అందుకే తమ వివాహ ప్రణాళికను మళ్లీ మార్చుకున్నామని ప్రధాని చెప్పారు. అయితే, త్వరలోనే తాము వివాహం చేసుకుంటామని, ఎంతో ఓర్పుతో ఎదురుచూస్తున్నా బో అని మెట్టె ఫ్రెడిక్సన్ పేర్కొన్నారు. ఇక దేశం కోసం తన వివాహాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటున్న తమ ప్రధానిపై డెన్మార్ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Recommended Video
కరోనాపై యూరోపియన్ యూనియన్ కీలక భేటీ..
కాగా, బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జులై 17, 18 తేదీలలో అసాధారణ యూరోపియన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. దీనిలో యూరోపియన్ యూనియన్కు చెందిన 27 దేశాల నేతలు వీడియో సమావేశం ద్వారా పాల్గొనున్నారు. కరోనా వ్యాప్తి అనంతరం ఈ సమావేశం జరగడం ఇదే తొలిసారి. నూతన యూరోపియన్ యూనియన్ బడ్జెట్, కరోనాను ఎదుర్కొనేందుకు వ్యూహాలు వంటి కీలకాంశాలపై చర్చించనున్నారు. కాగా, డెన్మార్క్ దేశంలో ఇప్పటి వరకు 12,636 కరోనా కేసులు నమోదు కాగా, 603 మంది ప్రాణాలు కోల్పోయారు. 11, 460 మంది కోలుకున్నారు.