బ్రిడ్జి పైన సెల్ఫీ తీసుకుంటూ పోలాండ్ యువతి మృతి
మాడ్రిడ్: స్పెయిన్లో ఓ వైద్య విద్యార్థిని సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ మృతి చెందింది. పోలాండ్ దేశానికి చెందిన సెల్వియా రాజ్చెల్ అనే విద్యార్థిని స్పెయిన్లోని సెవిల్లే నగరంలో ప్రఖ్యాత ట్రైయానా బ్రిడ్జి పైన నిలబడి సెల్ఫీ తీసుకుంటోంది. అయితే, ఆమె ప్రమాదవశాత్తూ జారి 15 అడుగుల కిందకు పడిపోయింది.
తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఇలాంటి విషాద సంఘటన జరగడం దురదృష్టకరమని, పర్యాటకుల రక్షణ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సెవిల్లే నగర అధికార ప్రతినిధి సెంట్రల్ యూరోషియన్ న్యూస్కు (సీఈఎన్) తెలిపారు.
ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉంటుందని, ఆమె మృతిని తాము నమ్మలేకపోతున్నాని, మళ్లీ చూడలేకపోతున్నామనే దానిని నమ్మలేకపోతున్నామని సెల్వియా తల్లి బెర్నాడెటా అన్నారు.
కాగా, సెల్వియా రాజ్చెల్ పొసాడాలో యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్లో చదువుతోందని, ఈ పొసాడా సదర్న్ పోలాండ్లో ఉందని సీఈఎన్ తెలిపింది. స్పెయిన్కు వెళ్లాలనేది తన కూతురు కల అని తల్లి బెర్నాడెటా వ్యాఖ్యానించారు. ఆ కల ఆమెకు నిజమైందని వ్యాఖ్యానించారు.
ఆమె తనకు తానుగానే స్పెయిన్ వెళ్లేందుకు భాషను నేర్చుకుందని చెప్పారు. తన చదువుల అనంతరం, భవిష్యత్తులోను స్పెయిన్లోనే ఉండి అక్కడే వర్క్ చేద్దామని భావించారని బెర్నాడెటా తెలిపారు. తన కూతురు చనిపోయిందన్న విషయం తెలియడంతో తన గుండెలు బద్దలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదం వింటానని అనుకోలేదన్నారు.