నదిలో కూలిన ట్రాన్స్ఏషియా విమానం, 16కు పెరిగిన మృతులు
తైపీ: విమానాలు కూలిపోవడం ప్రపంచంలో సర్వసాధారణంగా మారినట్లుంది. ఇటీవలి సంఘటనలను మరిచిపోక ముందే తాజాగా మరో విమానం కూలింది. ట్రాన్స్ఆసియా విమానం తైపీ నదిలో కూలిపోయింది. అందులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు.
ప్రయాణికులతో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. సహాయం కోసం పది మంది నిరీక్షిస్తున్నట్లు తైపీ స్టేట్ మీడియా వెల్లడించింది. తైవాన్ రాజధాని టైపీ వెలుపల గల నదిలో బుధవారంనాడు ఆ విమానం కూలింది. దేశీయ ట్రాన్స్ఆసియా ఎటిఆర్ 72-600 టర్బోప్రోప్ విమానం రోడ్డు వంతెనను తాకి నదిలో పడినట్లు సమాచారం.
విమానం తైపీ నుంచి కెన్మెన్ విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. స్తానికులు పలువురిని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.విమానం కూలుంగ్ నదిలో ఒడ్డుకు 100 మీటర్ల దూరంలో ఉన్నట్లు తైవాన్ మీడియా ప్రసారం చేస్తున్న చిత్రాలు తెలియజేస్తున్నాయి. తైపీ నుంచి బయలుదేరిన విమానానికి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం గం.10.55 నిమిషాలకు ఫ్లైట్ కంట్రోలర్స్తో సంబంధం తెగిపోయింది.
విమానం ఫ్రాన్స్ తయారు చేసిన రెండు ఇంజన్ల టుర్బోప్రోప్ ఎటిఆర్ 72గా తేలింది. విమాన సిబ్బందిలో ఇద్దరు పైలట్లు ఉన్నారు.విమానం నదిలో కూలడంతో దాదాపు 27 మందిని రక్షించారు. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇతరుల ఆచూకీ లభించడం లేదు. ప్రయాణికుల్లో 31 మంది చైనాకు చెందినవారని తెలుస్తోంది. విమానం ముందు సీట్లలో ఉన్నవారు మరణించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
విమానంలోకి దారి చేసుకోవడానికి సహాయక బృందాలు లగేజీని తీసేస్తున్నారు. విమానం రెక్క ఒక్కటి టాక్సీని ఢీకొట్టినట్లు చెబుతున్నారు. టాక్సీ డ్రైవర్ గాయపడ్డాడు. 165 మందితో ఎనిమిది పడవలు స్థానికులకు సహకరిస్తున్నట్లు తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.
విమాన ప్రమాదానికి గల కారణాలను వెల్లడించడానికి ట్రాన్స్ ఏషియా మీడియా కార్యాలయం నిరాకరించింది. విషయాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పింది. విమానం కూలిపోవడానికి గల కారణాలను తైవాన్ సివిల్ ఏరోనాటిక్స్ అధికార యంత్రాంగం కూడా చెప్పలేకపోతోంది.
ఇదే తైపీకి చెందిన ఎయిర్లైన్ విమానం గత జులై 23వ తేదీన పెంఘూ దీవుల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 48 మరణించారు. ప్రస్తుత ప్రమాదం 64 ఏళ్ల ఎయిర్లైన్ ప్రతిష్టను దెబ్బ తీసే అవకాశం ఉంది.