మోసం: ట్రైవ్యాలీ వ్యవస్థాపకురాలికి 16 ఏళ్ల జైలు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ట్రైవ్యాలీ పేరుతో నకిలీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వందలాది మంది భారతీయ విద్యార్థుల కెరీర్ను దెబ్బ తీసిన మహిళకు అమెరికా కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సుసాన్ జియావో పింగ్ సు అనే మహిళ 2008లో ట్రైవ్యాలీ పేరుతో నకిలీ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. విశ్వవిద్యాలయం పేరుతో పలు రకాల నేరాలకు పాల్పడినందుకు ఆమెకు కోర్టు బుధవారంనాడు జైలు శిక్ష విధించింది.
వీసా నేరాలు, అక్రమ ఇమ్మిగ్రేషన్, మనీ లాండరింగ్ వ్యవహారాలకు పాల్పడిన ఆ విశ్వవిద్యాలయాన్ని అధికారులు మూసేయించారు. దాంతో పలువురు భారతీయ విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. వారిలోనూ తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.
ఏటా ఎందరో విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వస్తారని, ఇలాంటి నకిలీ సంస్థల వల్ల వారి విశ్వాసం దెబ్బ తినడమే కాకుండా దేశ ప్రతిష్ట దెబ్బ తింటుందని న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ వ్యాఖ్యానించింది. అమెరికాలో నివసించడానికి వీసా సంబంధిత పత్రాలను విదేశీయులకు, ఎక్కువగా భారతీయులకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. విసా ఫ్రాడ్, ఇతర అభియోగాలపై ఆమెను మార్చిలో కోర్టు దోషిగా తేల్చింది.
95 శాతం భారతీయ విద్యార్థులే..
అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం భారీ ఇమిగ్రేషన్ ఫ్రాడ్ 2011 జనవరిలో వెలుగు చూసింది. అధికారులు సోదాలు చేసి, విశ్వవిద్యాలయాన్ని మూసేశారు. దీంతో వందలాది మంది భారతీయ విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. వీరిలోనూ ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అధికార వర్గాలు దర్యాప్తు చేపట్టి విశ్వవిద్యాలయంలోని వీసా పర్మిట్లను దుర్వినియోగ పరుస్తూ మనీ లాండరింగ్కు, ఇతర నేరాలకు విద్యార్థులు పాల్పడుతున్నట్లు తేల్చారు.
ఈ విశ్వవిద్యాలయం సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా శివారులోని ప్లెజంటోన్లో ఉంది. గతవారం ఈ విశ్వవిద్యాలయం మూత పడింది. విశ్వవిద్యాలయంలో 1555 మంది విద్యార్థులుంటారు. వీరిలో 95 శాతం మంది భారతీయులే. విద్యార్థులు వివిధ కాలిఫోర్నియాలో ఉన్నట్లు చెబుతూ రెసిడెన్షియల్, ఆన్లైన్ కోర్సుల్లో చేరారని, నిజానికి వారంతా అక్రమంగా మేరీల్యాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నారని ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో తేలింది. పలువురు భారతీయ విద్యార్థులను అధికారులు విచారించారు. విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు.
ఐ - ఫారాల గొడవ
ఐ - 20 ఫారాలు ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం తమకు అధికారం ఇచ్చిందని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం తన వెబ్సైట్లో బుకాయించింది. అయితే, 5,500 మంది విద్యార్థుల్లో కేవలం 140 మందికి మాత్రమే ట్రైవ్యాలీ నుంచి ఈ ఫారాలు పొందారు. హైదరాబాదుకు చెందిన కొంత మంది విద్యార్థులకు ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం ఆ ఫారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎఫ్-1 వీసా ఫారాలకు సంబంధించిన అక్రమాలను గుర్తించడంలో హైదరాబాదు, చెన్నై అమెరికా కాన్సులేట్ గుర్తించడంలో విఫలమైనట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.
ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం లేదా ఏజెంట్ ఒక్కో విద్యార్థి నుంచి 25 లక్షల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేశారు. పని చేయడానికి చట్టబద్ధత లభిస్తుందనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు ఇతర విశ్వవిద్యాలయాల నుంచి ట్రై వ్యాలీకి మారినట్లు తెలుస్తోంది.
చిప్ లాక్స్
కుంభకోణం వెలుగు చూసిన తర్వాత దేశం విడిచి వెళ్లకుండా భారత విద్యార్థుల కాళ్లకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చిప్ లాక్స్ వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అప్పట్లో ఓ తెలుగు టీవీ చానెల్లో ప్రసారం చేసింది. భారత విద్యార్థులను అమెరికా ఎంబసీకి పిలిపించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీసా నిబంధనలను అతిక్రమించి విద్యార్థులు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అధికారులు ఆరోపించారు. తీవ్ర వివాదం చెలరేగి భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ తర్వాత ఇద్దరు విద్యార్థులకు చిప్ లాక్స్ తొలగించారు. అమెరికాలోని తెలుగు సంఘాలు తానా, ఆటా విద్యార్థులకు అండగా నిలిచాయి.