ఇదీ ట్రంప్ ట్విస్ట్: ఆఫ్ఘన్ రోబోటిక్స్ శాస్త్రవేత్తల టీంకు వెల్కం
ఆఫ్ఘనిస్థాన్లాంటి దేశంలో బాలికలతో కూడిన యువశాస్త్రవేత్తల బృందం రోబోటిక్స్ రంగంలో ప్రయోగాలు చేపట్టింది. వచ్చే వారం జరిగే అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాల్సి ఉన్నది.
కాబూల్/వాషింగ్టన్: వారు ఆరుగురు యువ శాస్త్రవేత్తలు.. అందునా అమ్మాయిలు. కఠినమైన కట్టుబాట్లు, మహిళలకు పరిమిత స్వేచ్ఛ ఉండే ఆఫ్ఘనిస్థాన్లాంటి దేశంలో బాలికలతో కూడిన యువశాస్త్రవేత్తల బృందం రోబోటిక్స్ రంగంలో ప్రయోగాలు చేపట్టింది. వచ్చే వారం జరిగే అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాల్సి ఉన్నది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తమ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాలన్న వారి సంకల్పానికి అడగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి.
అయితే వారి దృఢ సంకల్పం ముందు చివరికి విధి తలవంచింది. వీసాలు నిరాకరించి వారిని పోటీల్లో పాల్గొనకుండా అమెరికా అధికారులు ప్రయత్నించినా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని ఆ యువ శాస్త్రవేత్తలకు అవసరమైన పాస్ పోర్టులు, వీసాలు జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.
అదీ కూడా విమర్శలు వెల్లువెత్తిన తర్వాతే ఆయన స్పందించడం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా సైన్యం పోరాటం సాగిస్తున్న తరుణంలో అదే దేశానికి చెందిన యువ శాస్త్రవేత్తలను అనుమతించకపోవడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిలియంట్ ఆఫ్ఘన్ విద్యార్థినులకు అమెరికా స్వాగతం పలుకుతున్నదని డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్వీట్ చేయడం గమనార్హం.
Recommended Video
అమెరికాలో రోబోటిక్స్ కాంపిటీషన్ ఇలా
160కి పైగా దేశాల నుంచి ఔత్సాహికులైన యువ శాస్త్రవేత్తలు ఈ అంతర్జాతీయ పోటీలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఆరుగురు బాలికా శాస్త్రవేత్తల టీంకు పాస్ పోర్టు, వీసాలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు హోంలాండ్ సెక్యూరిటీ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత వారం జర్మనీలోని హాంబర్గ్లో జరిగిన జీ - 20 సదస్సుకు హాజరైనప్పుడు ఈ అంశంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ జనరల్ మైక్ మాస్టర్తో చర్చించిన తర్వాత ఆరుగురు యువతులకు పాస్ పోర్టుల జారీ ప్రక్రియ సుగమమైందని సమాచారం.
రోబోటిక్స్లో నిష్ణాతులైన అఫ్ఘన్ బాలికలు ఇలా..
రోబోటిక్స్ పోటీలో పాల్గొనేందుకు వస్తున్న వీరికి తాత్కాలిక ప్రాతిపదికన అత్యవసరంగా/మానవీయ కోణంలో వీసాలు జారీ చేయడానికి అంతా సిద్ధమైంది. గతంలో రెండుసార్లు ఎటువంటి అక్షర దోషాలు లేకున్నా.. బాలలకు వీసాలివ్వడానికి అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు ససేమిరా అన్నారు. దీంతో బాలలు స్కైప్ ద్వారా పోటీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో ముస్లిం జనాభా గల దేశాల పౌరులకు అమెరికాలో ప్రయాణంపై ట్రంప్ నిషేధం విధించిన సందర్భంలో ఈ చిన్నారులు పాస్ పోర్టు, వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయా దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ లేదనుకొండి. అదే వేరే సంగతి.
అన్ని విధాల ఇలా అమెరికా అడ్డుకుంది
వాషింగ్టన్లో ఈ నెలలో నిర్వహించే అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అఫ్గనిస్థాన్లోని హెరత్ పట్టణానికి చెందిన ఆరుగురు బాలికల బృందం సిద్ధమైంది. బంతులను సరైన క్రమంలో అమర్చే రోబోలను రూపొందించింది. ఇలాంటి ప్రయోగాలు చేపట్టే బృందాలకు రోబోటిక్ విడిభాగాలు ఆలస్యంగా మార్చి నెలలో సమకూరాయి. అమెరికా నుంచి ఇవి రావాల్సి ఉండటంతో.. తీవ్రవాద ప్రభావ దేశం పేరుతో వీటిని అధికారులు అడ్డుకున్నారు. అయినా ఆ యువ ఇంజినీర్ల పట్టుదల, దీక్ష ముందు అమెరికా అధికారులు అడ్డంకులేమీ చేయలేకపోయాయి. ఆ రోబోటిక్ ఇంజినీర్లు ఏ మాత్రం నిరుత్సాహపడకుండా సొంతంగా రూపొందించిన వస్తువులతో తమ ప్రాజెక్టును కొనసాగించారు.
Skipe2
రెండు సార్లు దరఖాస్తుచేసినా అమెరికా నో
అమెరికా వెళ్లేందుకు తల్లిదండ్రులను ఒప్పించి 500 మైళ్ల దూరంలోని కాబూల్కు చేరుకొని అమెరికా ఎంబసీలో వీసాల కోసం రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఎంబసీ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగినప్పటికీ వారు భయపడలేదు. అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని అనుకునేలోపే వారిని దురదృష్టం వెక్కిరించినా ట్రంప్ జోక్యంతో అంతా సుఖాంతమైంది.
Skipe3
స్కైప్ ద్వారా చాన్స్ కల్పించడంతో ఇలా సంతోషం
ఇరాన్, సూడాన్, సిరియాలాంటి దేశాల నుంచి పాల్గొనే బృందాలకు వీసాలు లభించి తమకు లభించకపోవడంతో ఈ ఆఫ్ఘనిస్థాన్ బృందం తీవ్ర నిరాశకు గురయ్యారు.. ‘మేం ఏదైనా సాధించగలం అని ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాం. మాకు కావాల్సింది ఒక్క అవకాశం మాత్రమే' అంటూ ఆ బృందంలోని 14 ఏళ్ల బాలిక ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల బృందాలకు అనుమతి ఇచ్చి మమ్మల్ని పాల్గొనకుండా చేయడం ఆఫ్ఘన్ ప్రజలను అవమానించడమేనని బృందంలోని మరో బాలిక లిడా అజీజ్ అన్నారు. ఆఫ్ఘన్ బృందానికి విసాలు నిరాకరించడంపై ఆ పోటీలు నిర్వహించే ‘ఫస్ట్ గ్లోబల్' సంస్థ అధ్యక్షుడు జోయే సెస్టాక్ ఫేస్బుక్లో స్పందించారు. ‘విసాలు నిరాకరిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం విచారకరం. ఆ బాలికల బృందం స్కైప్ వీడియో లింక్ ద్వారా హెరత్ పట్టణం నుంచే ఈ పోటీల్లో పాల్గొనవచ్చు' అని పేర్కొన్నారు. కానీ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ జోక్యంతో నేరుగా పోటీల్లోనే పాల్గొనేందుకు అవకాశం చిక్కింది.