అమెరికా ఎన్నికల్లో అసలు సమరం అక్కడే- కీలక రాష్ట్రాలపై ట్రంప్, బిడెన్ గురి
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరానికి రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్న ముందస్తు పోలింగ్లో భారీగా ఓట్లు పోలవుతున్నాయి. గత రికార్డులను తిరగరాస్తూ ఇప్పటికే 27.9 మిలియన్ల ఓట్లు పోలయినట్లు అధికారిక అంచనాలు చెబుతున్నాయి. వీటిలో ఆధిక్యం సంగతి ఎలా ఉన్నా ఫలితాలను మలుపు తిప్పుతాయని భావిస్తున్న కీలక రాష్ట్రాల్లో ట్రంప్, బిడెన్ వర్గాలు దృష్టిసారించాయి.
అమెరికా ఎన్నికల్లో రికార్డు స్ధాయి ముందస్తు పోలింగ్- ఓటేసిన 2.2 కోట్ల మంది
2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ చేతిలో తాను ఓటమి పాలైన కీలక రాష్ట్రం నెవెడాలో తాజాగా పర్యటించిన ట్రంప్.. ముందస్తు పోలింగ్లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ నవంబర్ 3న జరిగే పోలింగ్లో ఓటేయాలని చెబుతూ వస్తున్న రిపబ్లికన్లు ఇప్పుడు ఇలా రూటుమార్చడం వెనుక ముందుజాగ్రత్త చర్యలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు నెవెడాలో ఎన్నికల ప్రచారం ఏ స్ధాయిలో ఉందంటే బిడెన్ అధికారంలోకి వస్తారని, కఠిన మైన లాక్డౌన్లు విధిస్తారని ట్రంప్ ఓటర్లను రెచ్చగొడుతున్నారు. అసలే మాస్కులు సరిగా ధరించని నెవెడా ప్రజల్లోకి ట్రంప్ వ్యాఖ్యలు గట్టిగానే పనిచేయాలని అసోసియేటెడ్ ప్రెస్ తన తాజా రిపోర్టులో పేర్కొంది. ఇక్కడ ట్రంప్ ప్రచారం తర్వాత స్ధానికులు బిడెన్ను బూతులు తిట్టారని తెలిపింది. దీన్ని బట్టి కరోనా విషయంలో రాజకీయ ప్రచారం ఎలా సాగుతోందో అర్ధమవుతుంది.
ఇదే కోవలో ట్రంప్ మరో చోట మాట్లాడుతూ బిడెన్ శాస్త్రవేత్తల మాట వింటాడు. నేను కూడా వారి మాట విని ఉంటే కరోనా సమయంలో దేశం ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లి ఉండేదని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్కు భిన్నంగా బిడెన్ మాత్రం మరో కీలక రాష్ట్రం నార్త్ కరోలినాలో తాజాగా జరిగిన ఓ ప్రచార సభలో మాట్లాడుతూ అమెరికాలో సాగుతున్న వ్యవస్ధాగత వర్ణవివక్షకు వ్యతిరేకంగా క్రిమినల్ జస్టిస్లో సంస్కరణలు తీసుకురావాలని, నల్ల జాతీయుల కోసం ప్రత్యేకంగా ఆర్ధిక వనరులు సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం తమకు కరోనా లక్షణాలున్నప్పటికీ పట్టించుకోకుండా ఇద్దరు అభ్యర్ధులు ట్రంప్, బిడెన్ ప్రచారంలో పాల్గొంటుండటం కలవరం రేపుతోంది. వీరు ప్రధానంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ద, కరోనా వైరస్, పన్నులు, లాక్డౌన్ వంటి అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. చైనాతో సంబంధాలను కూడా ట్రంప్ ఎక్కువగా తెరపైకి తెస్తున్నారు. అయితే వీటిని ఓటర్లు ఎంతవరకూ రిసీవ్ చేసుకున్నారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.