చైనా నిర్లక్ష్యానికి ప్రపంచం అనుభవిస్తోంది: మరోసారి డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: కరోనావైరస్(కొవిడ్-19) ప్రపంచ దేశాలకు వ్యాపించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనానుద్దేశించి తీవ్రంగా స్పందించారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని మండిపడ్డారు. వూహాన్లో కరోనావైరస్ గుర్తించిన వెంటనే చైనా బయటపెట్టలేదని, దాని వల్లే ప్రపంచం ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. వూహాన్ నగరంలో బయటపడిన కరోనావైరస్ను ఆదిలోనే కట్టడి చేస్తే అది ఆ ప్రాంతానికే పరిమితమయ్యేదని.. చైనా నిర్లక్ష్యం వల్లే ప్రపంచ దేశాలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలుసని, ఇదే నిజమని తాను కూడా నమ్ముతున్నానని చెప్పారు.
చైనా కరోనావైరస్ పట్ల వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి వల్లే ఇప్పుడు ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటోందని మండిపడ్డారు. కరోనావైరస్ గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని ధ్వజమెత్తారు. కరోనావైరస్ తీవ్రతను ప్రపంచ దేశాలకు తెలియకుండా.. చైనా అక్కడి వైద్యులు, జర్నలిస్టులను కట్టడి చేసిందని ఆరోపించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విస్తరించడానికి చైనానే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు ట్రంప్. కాగా, చైనాపై ప్రతిచర్యలు ఉంటాయా? అన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పలేదు. ఇప్పటిక కరోనావైరస్ను చైనా వైరస్ అంటూ డొనాల్డ్ ట్రంప్ చైనాకు ఆగ్రహం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా కూడా ట్రంప్పై మండిపడుతోంది.
కాగా, కరోనావైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. 2లక్షల మందికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో 200 మరణాలు సంభవించగా.. 14వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐరోపాలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.
Recommended Video
చైనాలో కరోనా బారినపడి 3245 మరణాలు సంభవించగా.. ఇటలీలో 3400 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇటలీలో గురువారం ఒక్కరోజే 427 మంది మరణించడం గమనార్హం. ఇప్పటి వరకు ఇటలీలో కరోనాబారిన పడిన వారి సంఖ్య 42వేలకు చేరింది. ఇక భారతదేశంలో 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఐదు మరణాలు సంభవించాయి.