మాటమార్చిన ట్రంప్... కశ్మీర్ అంశం అంతర్గత వ్యవహారం అన్న అమెరికా అధ్యక్షుడు
Recommended Video
ఫ్రాన్స్ : జీ-7 సమావేశంలో భాగంగా ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా కశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమని ట్రంప్ అన్నారు. కశ్మీర్ అంశంను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రంప్ కోరారు. ఇక కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధాని మోడీ అన్నారు.
ప్రధాని మోడీతో గతరాత్రి కశ్మీర్ అంశంపై మాట్లాడినట్లు చెప్పిన ట్రంప్... కశ్మీర్ అంశాన్ని ఎలా డీల్ చేయాలో మోడీకి పూర్తి అవగాహన ఉందన్నారు. కశ్మీర్ తమ అధీనంలో ఉందని చెప్పారు. ఇరు దేశాలకు మంచి జరిగేలా కశ్మీర్ అంశంపై చర్చలు జరుపుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు ట్రంప్. ఇదిలా ఉంటే పాకిస్తాన్తో తమకు ఎన్నో ద్వైపాక్షిక అంశాలు ముడిపడి ఉన్నాయని... రెండు దేశాల మధ్య ఏ ఒక్క దేశం జోక్యం చేసుకోవాలని తాము కోరుకోవడం లేదని ప్రధాని మోడీ అన్నారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొంటామని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్య ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా భారత్ పాక్లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా అంతర్గత వ్యవహారమని మరోసారి మోడీ పునరుద్ఘాటించారు. భారత్ పాక్లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్న మోడీ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండు దేశాల ప్రజల శాంతితో మెలిగేలా అక్కడ వాతావరణంను తయారు చేయాలని అన్నారు. ఇక పాకిస్తాన్లో ఎన్నికల అనంతరం ఇమ్రాన్ఖాన్కు తాను ఫోన్ చేసినట్లు ప్రధాని మోడీ చెప్పారు. రెండు దేశాలు ఉగ్రవాదం, పేదరికం, ఆరోగ్యం, విద్య అనే ప్రధాన అంశాలపైన కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చినట్లు మోడీ గుర్తు చేశారు.
#WATCH: US President Donald Trump during bilateral meet with PM Modi at #G7Summit says,"We spoke last night about Kashmir, Prime Minister really feels he has it under control. They speak with Pakistan and I'm sure that they will be able to do something that will be very good." pic.twitter.com/FhydcW4uK1
— ANI (@ANI) August 26, 2019
ఇక అమెరికాతో ప్రతి రంగంలో కలిసి పనిచేస్తామని చెప్పారు ప్రధాని మోడీ. తనకు ప్రధానిగా రెండో సారి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ట్రంప్ ఫోన్ చేసి తనను అభినందించారని గుర్తుచేశారు మోడీ. అమెరికా భారత్లో ప్రజాస్వామ్యదేశాలని చెప్పిన ప్రధాని రెండు దేశాలు కలిసి ఇకముందు కూడా పనిచేస్తాయని చెప్పారు. అమెరికా ఇస్తున్న సూచనలను చాలా సందర్భాల్లో పరిగణలోకి తీసుకున్నామని మోడీ చెప్పారు. అమెరికాలో భారతీయులకు ఉన్న గౌరవం మాటల్లో చెప్పలేనిదని ప్రధాని మోడీ అన్నారు. ఈ సంరదర్భంగా అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ.