ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్: తగ్గాలంటూ ఇమ్రాన్కు క్లాస్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ద్వైపాక్షిక చర్చల ద్వారా తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాల ప్రధానులను కోరారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్లకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఇరు దేశాధినేతలతో ట్రంప్..
కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే ఆగస్టు 16న ఇమ్రాన్ ఖాన్తో ట్రంప్ ఈ అంశంపై మాట్లాడారని వైట్ హౌస్ వెల్లడించింది. వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట డొనాల్డ్ ట్రంప్ మొదట భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్తో ఫోన్లో సంభాషించారు.
ఇదే తొలిసారి..
కాగా, కాశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం అవసరమని అమెరికా నాయకుడు చెప్పిన తర్వాత ప్రధాని మోడీతో ట్రంప్ మాట్లాడటం ఇదే తొలిసారి. భారత్-పాకిస్థాన్ దేశాలు తమ మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ద్వైపాక్షిక చర్చలను ఆశ్రయించాలని ఇరు దేశాధి నేతలకు డొనాల్డ్ ట్రంప్ సూచించారని వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
కాస్త తగ్గు ఇమ్రాన్..
ఇటీవల ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రభుత్వం, ప్రధానిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఈ సందర్భంగా ట్రంప్తో ప్రస్తావించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను పెంచేలా ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడిన ట్రంప్.. మితంగా మాట్లాడాలని, ఇరుదేశాల మధ్య శాంతియువత వాతావరణానికి కృషి చేయాలని సూచించారు. ఉద్రిక్తతలు పెంచేలా వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు.
మోడీ ఇలా.. పాక్ అలా..
ఇరుదేశాల(భారత్-పాకిస్థాన్) మధ్య శాంతియువత వాతావరణం ఏర్పడేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దులో పొంచివున్న ఉగ్రవాద ముప్పును తుదముట్టిస్తామని మోడీ ఈ సందర్భంగా ట్రంప్కు తెలియజేసినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. జమ్మూకాశ్మీర్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోందని, రాజకీయ నాయకుల అరెస్టులు కూడా ఆగడం లేదని అమెరికా దేశాధినేతకు ఇమ్రాన్ ఖాన్ తెలిపినట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి సోమవారం రాత్రి వెల్లడించారు. ఇది ఇలా ఉండగా, మానవ హక్కుల సంఘాలు భారతదేశంలోని కాశ్మీర్ను సందర్శించాలని, అక్కడి పరిస్థితిని గమనించాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చినట్లు డాన్ పత్రిక పేర్కొంది.