ట్రంప్ దెబ్బకు పాక్ దెయ్యం దిగింది: హఫీజ్ సయీద్ నిర్భంధం
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు పాకిస్థాన్ కు దడ పుట్టింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని, పాకిస్థాన్ నుంచి కూడా వలసలను నిషేధించే యోచన ఉందని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రకటిస్తున్న నేపథ్యంలో పాక్ హడలిపోయింది.
మొదటికే మోసం వస్తుందన్న భయంతో పాక్ వెంటనే అమెరికా ప్రకటించిన ఉగ్రవాదుల లిస్టులో ఉన్న లష్కర్ ఏ తోయిబా చీఫ్, జమాత ఉద్ దవా (జేయూడీ) నాయకుడు, 2008 ముంబై మారణకాండ ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ ను పాక్ ప్రభుత్వం హౌస్ అరెస్టు చేసింది.
హఫీజ్ సయీద్ తో పాటు అబ్దుల్లా ఉబైద్, జాఫర్ ఇక్భాల్, అబ్దుల్ రెహమాన్ అబిద్, కాజీ కాషిఫ్ నియాజ్ అనే మరో నలుగురు ఉగ్రవాద సంస్థల నాయకులను హౌస్ అరెస్టు చేసిన పాక్ ప్రభుత్వం ఊపిరిపీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది.
ఫలా-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్, జమాత్ ఉద్ దవాలపై ఆరు నెలలపాటు వాచ్ లిస్ట్ లో ఉంచాలని జనవరి 27వ తేదిన పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే లాహోర్ హోం శాఖ అధికారులు జమాత ఉద్ దవా హెడ్ క్వార్టర్స్ ను చుట్టుముట్టారు.
యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద హఫీజ్ సయీద్ ను హౌస్ అరెస్టు చేశారు. అతని కార్యాలయం మీద ఉన్న జెండాలు అన్నీ పీకిపారేశారు. కార్యాలయంలో పాక్ జెండాలు ఎగరవేశారు. ఈ కార్యాలయానికి వెళ్లే అన్ని రహదారుల్లో ఉన్న హఫీజ్ సయీద్ కటౌంట్ల, బ్యానర్లు లు నేలమట్టం చేశారు.
ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీల మధ్య పెరుగుతున్న దోస్తీ వల్లనే పాక్ ప్రభుత్వం తనను హౌస్ అరెస్టు చేసిందని హఫీజ్ సయీద్ ఓ వీడియోలో ఆరోపించాడు. లాహోర్ లో ఉన్న హఫీజ్ ను త్వరలో అతని సొంత ఊరికి తరలిస్తారని సమాచారం.
పాక్ ప్రభుత్వం ఇప్పటికే హఫీజ్ సయీద్ ఇంటిని సబ్ జైలుగా ప్రకటించింది. ట్రంప్ కు జడిసే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పాక్ చెందిన డాన్ పత్రికతో పాటు ఆ దేశంలోని మీడియా ఆరోపిస్తోంది.
2014లోనే అమెరికా ప్రభుత్వం జమాత ఉద్ దవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం, పాక్ దేశాల మధ్య సంఘర్షణ జరుగుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
2008 ముంబై మారణకాండలో 166 మంది మృతికి ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయిద్ ను హౌస్ అరెస్టు చేసి అమెరికాకు దగ్గరకావడానికి పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే స్థానిక మీడియా మాత్రం పాక్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.