ట్రంప్ ఎఫెక్ట్: పెరిగిన గోల్డ్ ధర, భారత టెక్కీల్లో ఆందోళన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు పెరగడంతో అమెరికాలోని భారత టెక్కీల్లో ఆందోళన ప్రారంభమైంది. హిల్లరీ క్లింటన్ గెలిస్తే పాకిస్తాన్కు మద్దతిస్తారని అక్కడి హిందూ సంస్థలు ప్రచారం చేస్తున్నప్పటికీ భారత సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన పెరిగింది. అదే సమయంలో భారత స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల తాజా సర్వే ఫలితాల వెల్లడితో బుధవారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురైంది. పలు కంపెనీ షేర్లు పతనం కావడంతో పలువురు మదుపుదారులు నష్టపోయారు. ఇదిలావుంటే, బంగారం, వెండి ధరలు పెరిగాయి.
దానికితోడు అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం అక్కడ విద్యావకాశాలపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో స్థిరపడిన వారి భవితవ్యంపై కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది ఉపాధి, చదువుల కోసం అమెరికా వెళుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జిల్లాలో ఆసక్తి నెలకొంది.
ఉద్యోగాల విషయంలో అమెరికా ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ట్రంప్ తన ప్రచారంలో భారత్ ఉద్యోగావకాశాలను కొల్లగొడుతుండడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలవారి ఉద్యోగాలపై నిబంధనలు పెడుతామని ఆయన చెప్పారు. దీంతో అక్కడి టెక్కీలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్
అమెరికా అధక్ష ఎన్నికలపై సర్వే ఫలితాలు బుధవారం స్టాక్ మార్కెట్ను షేక్ చేశాయి. సెస్సెక్స్ 360 పాయింట్లు నష్టపోయింది. ఆరంభం నుంచి మార్కెట్ లో ఇదే ధోరణి సాగింది. ఒక దశలో సూచిక 400 పాయింట్లు నష్టపోయి తరువాత కొద్దిగా రికవరీ అయింది.
బ్యాంకింగ్తో పాటు అన్ని రంగాల షేర్లు భారీగా పతనం కావడంతో జిల్లాలోని మదుపుదారులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో మార్కెట్ ఏ విధంగా ఉంటుందనే భయంతో పెట్టుబడులను అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు.
పెరిగిన బంగారం, వెండి ధరలు
నెల రోజులుగా స్థిరంగా ఉంటున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బంగారం పది గ్రాములకు రూ.500 పెరిగింది. కేజీ వెండి రూ.800 వరకు పెరిగింది. బుధవారం పది గ్రామాలు మేలిన బంగారం రూ 31,300 పలికింది. కేజీ వెండి రూ 44,400కు చేరింది. రానున్న రోజుల్లో బంగారం ధర మళ్లీ రూ.32వేలు దాటవచ్చుననే ప్రచారం సాగుతోంది.