బైడెన్కు లైన్ క్లియర్... ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ట్రంప్... అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్...
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. అధ్యక్ష పగ్గాలు బైడెన్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార మార్పిడికి అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. అదే సమయంలో ఎన్నికల్లో అవకతవకలపై తన న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ వైట్ హౌస్ను వీడేందుకు మొండికేస్తే అనుసరించాల్సిన ప్రక్రియపై నిన్నటిదాకా సర్వత్రా చర్చ జరిగింది. ట్రంప్ తాజా ప్రకటనతో ఇక బైడెన్కు అధికారం కట్టబెట్టేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.
ట్రంప్ ఏమన్నారు...
'దేశం పట్ల ఉన్న నిబద్దత,విధేయతకు జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జీఎస్ఏ) చీఫ్ ఎమిలీ ముర్ఫీకి ధన్యవాదాలు చెప్తున్నాను. కొద్దిరోజులుగా ఆమె వేధింపులకు,బెదిరింపులకు గురవుతున్నారు. దూషణలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు,ఆమె కుటుంబానికి,జీఎస్ఏ ఉద్యోగులకు ఎదురవుతున్న ఈ పరిస్థితులను నేను చూడలేకపోతున్నాను. కాబట్టి దేశ ప్రయోజనాల రీత్యా నిబంధనల ప్రకారం అధికార మార్పిడికి అనుసరించాల్సిన ప్రక్రియను ప్రారంభించాలని ఎమిలీని కోరుతున్నాను. అదే సమయంలో ఎన్నికలపై మా న్యాయ పోరాటం కొనసాగుతుంది.' అని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్లో వెల్లడించారు.
బైడెన్కు ముర్ఫీ లేఖ...
అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్కు జీఎస్ఏ చీఫ్ ఎమిలీ ముర్ఫీ సోమవారం(నవంబర్ 23) ఒక లేఖ రాశారు. అధికార మార్పిడి ప్రక్రియను షురూ చేసేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సిద్దంగా ఉందని అందులో పేర్కొన్నారు. ఆ లేఖ బైడెన్కు చేరిన కొద్ది గంటలకే ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటన చేశారు. 'చట్టం,అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా నాకు నేనుగా ఈ నిర్ణయానికి వచ్చాను. వైట్ హౌస్,జీఎస్ఏతో సహా ఏ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ నుంచి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. నా నిర్ణయాన్ని ఆలస్యం చేసే చర్యలేవీ జరగలేదు. అధికార మార్పిడికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సిద్దంగా ఉంది.' అని ఎమిలీ ముర్ఫీ బైడెన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Recommended Video
లైన్ క్లియర్...
ట్రంప్ తాజా ప్రకటనతో బైడెన్ అధికారాన్ని చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. దీనిపై బైడెన్-హ్యారిస్ ట్రాన్సిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోహన్నెస్ అబ్రహం మాట్లాడుతూ... 'ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫెడరల్ సంస్థలు అధికారికంగా అధికార మార్పిడి చేపట్టేందుకు అవకాశం చిక్కింది. రాబోయే రోజుల్లో బైడెన్ ట్రాన్సిషన్ అడ్మినిస్ట్రేషన్ ఫెడరల్ సంస్థల అధికారులను కలిసి కరోనా,జాతీయ భద్రతా తదితర అంశాలపై చర్చిస్తారు. తద్వారా ఆయా అంశాల పట్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన కృషిని అంచనా వేస్తాం.' అని తెలిపారు. ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు,రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు.