అజ్ఞానం తొలిగి జ్ఞానంనిండాలి: ఇండో అమెరికన్లకు ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు
వాషింగ్టన్ : అమెరికాలోని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో నివాసముంటున్న హిందువులకు, జైన్లకు, సిక్కులకు బౌద్ధ మతస్తులకు ఈ సందర్భంగా ట్రంప్ విషెస్ చెప్పారు. దీపావళి పండగ రోజున ప్రతి ఏటా అమెరికా విద్యుద్దీపాలతో అలంకరించబడుతుందని గుర్తు చేసిన ట్రంప్... అమెరికాలో మత స్వేచ్ఛ చాలా ఉందని చెప్పేందుకు నిదర్శనం దీపావళి పండగ అని వ్యాఖ్యానించారు. ఓవల్ కార్యాలయంలో ఒకరోజు ముందే ట్రంప్ ఇండో అమెరికన్లతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
అమెరికా రాజ్యాంగంలో ఉన్నట్లుగానే ఇక్కడి ప్రజలు తమ ఇష్ట దైవాలకు ప్రార్థనలు కానీ పూజలు కానీ చేసుకోవచ్చని అది వారి ఇష్టప్రకారం జరుగుతుందని ఫలానా మతాన్నే స్వీకరించాలని బలవంతం చేయబోమని ట్రంప్ పేర్కొన్నారు. ఇక దీపావళి సందర్భంగా తను తన భార్య మెలీనియా తరపున శుభాకాంక్షలు చెబుతున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇక దీపావళి పండుగ అంటే చీకటిపై వెలుగు గెలవాలని, అని చెడుపై మంచి విజయం సాధించాలని, అజ్ఞానం తొలిగిపోయి జ్ఞానం నిండాలని ట్రంప్ ఆకాంక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్దులు ఈ పవిత్ర పండగ సమయంలో పూజలు నిర్వహిస్తారని, దీపాలు వెలిగిస్తారని, సంప్రదాయ పద్ధతిలో వేడుకలు నిర్వహిస్తారని తమ కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో చాలా సంతోషంగా గడుపుతారని ట్రంప్ చెప్పారు. ఇక వైట్హౌజ్లో దీపంను వెలిగించడం ద్వారా ట్రంప్ దీపావళి వేడుకలను ప్రారంభించారు. ఇక దీపావళి పండగ సందర్భంగా వైట్హౌజ్ను దీపాలతో అలంకరిస్తారనే ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇక ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వైట్హౌజ్లో దీపావళి వేడుకలు సంప్రదాయంగా జరుపుతున్నారు.