మా బదులు మీరే పోరాడండి: భారత్, పాక్లపై డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: తమ బదులు భారత్, పాకిస్థాన్ దేశాలు ఆఫ్గనిస్థాన్లో ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో తమ పాత్రను ఈ రెండు దేశాలు పోషించాలని ట్రంప్ కోరారు.
'భారత్ పక్కనే ఉంది. వారు పోరాడటం లేదు. మేము పోరాడుతున్నాం. పాకిస్థాన్ కూడా అటు పక్కనే ఉంది. వారు చాలా చాలా తక్కువగా పోరాడుతున్నారు. ఇది మంచిది కాదు. అమెరికా మాత్రం 7వేల మైళ్ల దూరంలో ఉంది' అని ట్రంప్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
త్వరలో ఫ్రాన్స్లో జరిగే జీ-7 సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొననున్నారు. ఈ సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సు సందర్భంగా వీరిద్దరు నేతలు కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నుంచి రెండ్రోజులపాటు ఫ్రాన్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ తర్వాత యూనైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ దేశాల్లో కూడా పర్యటించనున్నారు. బహ్రెయిన్ దేశంలో పర్యటించే తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించనున్నారు.
ఇది ఇలావుంటే, కాశ్మీర్ విషయంలో కూడా భారత్, పాకిస్థాన్ దేశాలు కోరితే తాము మధ్యవర్తిత్వం వహిస్తామని తాజాగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కాశ్మీర్ అంశం విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ పదే పదే చెబుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం మధ్యవర్తిత్వం అంటూ తరచూ వ్యాఖ్యలు చేయడం భారత్కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.