ట్రంప్-కిమ్ల సమావేశానికి కుదిరిన ముహూర్తం: ఎప్పుడంటే..?, గూర్ఖాల భద్రత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల భేటీకి మరోసారి ముహూర్తం ఖరారైంది. సింగపూర్ కాలమానం ప్రకారం జూన్ 12న ఉదయం 9గంటలకు ఇరువురు నేతలు సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రకటించింది.
ఇప్పటికే ట్రంప్, కిమ్ భేటీ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ తెలిపారు. ఉత్తరకొరియా అణ్వస్త్ర రహితంగా మారేందుకు చర్యలు ప్రారంభిస్తే ఆ దేశంతో తప్పకుండా భేటీ అవుతానని గతంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సింగపూర్ వేదికగా జూన్ 12న ట్రంప్, కిమ్ల సమావేశం జరగనుంది. ఈ భేటీని రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవల ట్రంప్ అన్యూహ్యంగా ప్రకటన చేయడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీంతో వీరి సమావేశం జరగదని అన్ని దేశాలు అనుకున్నాయి.
కానీ, ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల మంత్రితో భేటీ అయిన ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కిమ్తో సమేశానికి సింసిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో భేటీకి మార్గం సుగమమైంది. కాగా, ట్రంప్, కిమ్ సమావేశం కోసం సింగపూర్ అధికారులు దేశంలో భద్రతను ముమ్మరం చేశారు. సింగపూర్ పోలీసులతోపాటు గూర్ఖాలు కూడా ఈ భ్రదతా చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ప్రపంచంలోనే అత్యంత సాహస యోధుల తెగల్లో గూర్ఖా కూడా ఒకటి కావడం గమనార్హం.
గతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ల భేటీ సమయంలోనూ వీరు షాంగ్రీ-లా ఫైవ్ స్టార్ హోటల్ వద్ద భద్రతా విధుల్లో ఉన్నారు. కాగా, ప్రస్తుతం ట్రంప్-కిమ్ల సమావేశం కూడా జూన్ 12న షాంగ్రీ లా హోటల్లోనే జరిగే అకాశం ఉంది.