పసలేని భేటీ: ఎలాంటి ఒప్పందం లేకుండానే అర్థాంతరంగా ముగిసిన ట్రంప్-కిమ్ సమావేశం
అగ్రరాజ్యం అమెరికా ఉత్తరకొరియా దేశాల మధ్య చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసినట్లు అమెరికా వైట్హౌజ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇరుదేశాధినేతల మధ్య సత్ఫలితాలు వస్తాయని భావించినప్పటికీ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. దీంతో ఉత్తరకొరియా అణుపరీక్షల ప్రయోగం అంశం ప్రశార్థకంగా మారింది. ఇరు దేశాధినేతలు హనోయ్లో సహృదభావమైన వాతావరణంలో సమావేశం అయ్యారు. ఇరు దేశాధినేతల మధ్య మంచి నిర్మాణాత్మక చర్చలు జరిగాయని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ చెప్పారు. అణుప్రయోగాలు నిర్వహించకుండా, ఆర్థికంగా ఎలా ఎదగాలనే అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించడం జరిగిందని చెప్పారు. అయితే వీటిపై ఎలాంటి ఒప్పందం జరగలేదన్న వైట్ హౌజ్ వర్గాలు ఇరుదేశాల మధ్య భవిష్యత్తులో మరోమారు చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు.
అంతకుముందు ఇరు దేశాధినేతలు ఓ సంయుక్త ఒప్పందంపై సంతకాలు చేస్తారనే వార్తలు వచ్చాయి. ఇది భోజనం తరువాత జరుగుతుందని భావించారు కానీ జరగలేదు.అంతేకాదు సమావేశం షెడ్యూల్లో ఉన్నట్లుండి మార్పులు ఎందుకు చేశారనేదానిపై శాండర్స్ సమాధానం దాటవేశారు. ఇరుదేశాధినేతల నుంచి ఏదైనా సంయుక్త ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు చర్చలు జరుగుతున్నాయని ఆమె సమాధానంగా చెప్పారు.
ఇక ఎలాంటి ఒప్పందాలు జరగకుండానే చర్చలు ముగియడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. కొరియాలో షేర్ల విలువ పడిపోగా... యన్ మాత్రం పుంజుకున్నట్లు కనిపించింది. ఇక అమెరికా పాల్గొన్న పలు అంతర్జాతీయ సమావేశాల్లో ట్రంప్ మధ్యలోనే వెళ్లడం ఇది తొలిసారి కాదు. గతేడాది కూడా కెనడాలో జరిగిన జీ7 సమిట్ సదస్సులో భాగంగా వాతావరణం మార్పు గ్రీన్ ఎనర్జీపై జరిగిన సదస్సుకు కూడా హాజరుకాలేదు. స్టీల్ అలూమినియంలపై సుంకం ఎక్కువ విధించాలన్న అంశంపై ట్రంప్ వాదన చెల్లకపోవడంతో సదస్సు మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. సదస్సు నుంచి నేరుగా సింగపూర్లో కిమ్ జాంగ్ ఉన్తో సమావేశం అయ్యేందుకు ట్రంప్ బయలుదేరి వెళ్లారు.
ఇక సింగపూర్లో కిమ్ జాగ్ ఉన్తో సమావేశం చర్చలు తర్వాత ఉత్తరకొరియా అణుప్రయోగాలు చేయడం మానివేస్తుందేమో అని ట్రంప్ ఎదురుచూశారు. అయితే యథాతథంగా అణుప్రయోగాలు చేయడంతో అమెరికా ఉత్తరకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తాజా భేటీలో అణుపరీక్షలు ఆపివేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కిమ్ జాంగ్ ఉన్న చెప్పారు. అంతేకాదు ఇరుదేశాల మధ్య దౌత్యకార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పిన కిమ్... అయితే అది కచ్చితంగా జరుగుతుందా లేదా అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక ఇరుదేశాలకు సంబంధించిన చర్చలపై యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తోందని వ్యాఖ్యానించిన కిమ్ జాంగ్ ఉన్... మంచి ఫలితాలే చర్చల నుంచి రాబడుతామని ఉన్ చెప్పారు.