మోడీ ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించిన ట్రంప్..
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ .. ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులపై ప్రసంగించారు. మాటలు చాలు.. మిగిలింది చేతలే అని ప్రకటించారు. అయితే మోడీ మాట్లాడే సమయానికి అక్కడికి ఓ విశిష్ట అతిథి కూడా వచ్చారు. ఆయనే అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్. వాస్తవానికి ట్రంప్ షెడ్యూల్ ఐక్యరాజ్యసమితి సమిట్లో లేదు. కానీ మోడీపై ఉన్న అభిమారంతో అక్కడికి విచ్చేసి మోడీ చెప్పిన అంశాలను సావధానంగా అలకించారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు చేయాల్సిన అంశాలపై దృష్టిసారించింది.
అంతకుముందు వాతావరణ మార్పులపై మోడీ ప్రసంగించారు. మాటలు చాలని మిగిలింది చేతల్లో చూపాలని కోరారు. వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు మాటలు కోటలు దాటుతున్నాయని .. కానీ పని మాత్రం జరగడం లేదన్నారు. దీంతోపాటు పునరుత్పాదక వనరుల వినియోగం కూడా అవసరమేనని నొక్కి వక్కానించారు. దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి క్రమంగా పెరిగిందని పేర్కొన్నారు మోడీ. తమతో 80 దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకునే చర్యలపై మిగతా అధినేతలు దృష్టిసారించాలని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటికే వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.