అటు గ్రౌండ్లో.. ఇటు కోర్టుల్లో... ట్రంప్కు దెబ్బ మీద దెబ్బ... పిక్చర్ క్లియర్...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి మూడు రోజులు కావొస్తున్నా ఇంకా తుది ఫలితం వెల్లడి కాలేదు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. నిన్నటిదాకా ట్రంప్ ఆధిక్యంలో ఉన్న జార్జియా,పెన్సిల్వేనియాల్లోనూ చివరి నిమిషంలో ఫలితం మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జార్జియాలో ట్రంప్ కేవలం 2500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు చాలానే ఉండటంతో... అందులో ఎక్కువ శాతం బైడెన్కే పోల్ అయ్యే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది.
జార్జియా,పెన్సిల్వేనియా కూడా బైడెన్ ఖాతాలోకే..?
ఇప్పటివరకూ జార్జియాలో ట్రంప్,బైడెన్ ఇద్దరికీ 49.4శాతం ఓట్లు పోల్ అయ్యాయి. సబర్బన్ అట్లాంటా,సవాన్నా కౌంటీ సహా పలు పట్టణాల ఓట్లు ఇంకా తేలాల్సి ఉంది. ఆ ఓట్లు బైడెన్ ఖాతాలోనే పడే అవకాశం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. సీఎన్ఎన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అటు పెన్సిల్వేనియాలోనూ ట్రంప్ లీడ్ క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ట్రంప్ 50వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇంకా చాలా ఓట్లు లెక్కించాల్సి ఉండటంతో... ఇక్కడ కూడా ట్రంప్కు ఎదురుదెబ్బ తప్పదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోర్టుల్లో ఎదురుదెబ్బ...
అటు కోర్టుల్లోనూ ట్రంప్కు ఎదురుదెబ్బ తగులుతోంది. ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మిచిగాన్,జార్జియా కోర్టుల్లో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. అవకతవకలు జరిగాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపాయి. మిచిగాన్లో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని ట్రంప్ తన పిటిషన్లో పేర్కొనగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది. కౌంటింగ్ ప్రక్రియలో మిచిగాన్ స్టేట్ సెక్రటరీ జోక్యం చేసుకోవట్లేదని వెల్లడించింది. అటు పెన్సిల్వేనియా,నెవాడా రాష్ట్రాల్లోనూ ట్రంప్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. విస్కాన్సిన్లోనూ రీకౌంటింగ్ డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఒకటి,రెండు రోజుల్లో వీటిపై విచారణ జరిగే అవకాశం ఉంది.
నెవాడాలో బైడెన్ ఆధిక్యం
ఆరు ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవాడా రాష్ట్రంలో ప్రస్తుతం జో బైడెన్ 49.4శాతం ఓట్లతో(6,04,251) ఆధిక్యంలో ఉన్నారు.ట్రంప్ 48.5శాతం ఓట్లతో(5,92,813) స్వల్ప వెనుకంజలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 11,438 మాత్రమే. ఇప్పటివరకూ 84శాతం ఓట్లు మాత్రమే లెక్కించారు. పూర్తి ఓట్లు లెక్కించేసరికి ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది.
ట్రంప్ నిందారోపణలు...
అటు ట్రంప్ ఇప్పటికీ తన విజయంపై ధీమా వ్యక్తం చేస్తూనే డెమోక్రాటిక్ పార్టీపై నిందారోపణలు చేస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీ గనుక తన ఓట్లను తస్కరించకపోతే... విజయం తనదేనని తాజా ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. 'మీరు లీగల్ ఓట్లు లెక్కిస్తే... నేను సులువుగా గెలుస్తా.కానీ మీరు అక్రమ ఓట్లు లెక్కిస్తే... వాళ్లు మా విజయాన్ని లాగేసుకుంటారు. అయినా ఇప్పటికే పలు కీలక రాష్ట్రాల్లో నేను గెలిచాను.' అని ట్రంప్ ప్రకటించారు. ఎన్నికల మొదటిరోజు నుంచి ట్రంప్ తనదే విజయం అని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు బైడెన్ మాత్రం ప్రతీ ఓటు లెక్కించాల్సిందేనని... కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేయడం అమెరికా ప్రజల హక్కును కాలరాయడమేనని వాదిస్తున్నారు. చివరి ఓటు వరకు సహనంతో వేచి చూద్దామని పిలుపునిచ్చారు.