నోబెల్ ప్రైజ్కు నామినెట్ అయిన ట్రంప్- యూఏఈ-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందానికి గుర్తింపుగా..
ప్రపంచ పెద్దన్న, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు ఎదుర్కోబోతున్న ట్రంప్.. ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి నామినేట్ అయ్యారు. ట్రంప్ పేరును నోబెల్ శాంతి ఒప్పందానికి ప్రతిపాదిస్తూ నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ నామినేషన్ దాఖలు చేశారు.
Recommended Video
ట్రంప్ తన పదవీ కాలంలో ఇజ్రాయెల్-యూఏఈ మధ్య కుదిరిన చారిత్రక శాంతి ఒప్పందంతో పాటు భారత్-పాక్ మధ్య సమస్యగా ఉన్న కశ్మీర్ విషయంలోనూ మధ్యవర్తిగా వ్యవహరించి ఉద్రిక్తతల నివారణకు కృషి చేశారని నార్వే ఎంపీ టైబ్రింగ్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వూలో కొనియాడారు. ముఖ్యంగా ఇజ్రాయెల్-యూఏఈ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా మార్గదర్శిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. అలాగే అణ్వస్త్ర దేశమైన ఉత్తర కొరియాను ఒప్పించి దక్షిణ కొరియాతో నెలకొన్న ఉద్రిక్తతలను కూడా ట్రంప్ చల్లారేలా చేశారని టైబ్రింగ్ ప్రశంసించారు.
ఇజ్రాయెల్-యూఏఈ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇరుదేశాలు ఈ నెల 15న సంతకాలు చేయనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ ఒప్పందం కారణంగా ఇరుదేశాలు గతంలోలా శాంతియుతంగా కలిసి సంబంధాలు కొనసాగేందుకు వీలు కలగనుంది. 2020 సంవత్సరానికి నోబెల్ ప్రైజ్కు 318 మంది నామినేట్ కాగా ఇందులో 211 మంది వ్యక్తులు, 107 సంస్దలు ఉన్నాయి. ప్రస్తుతం 2021 సంవత్సరానికి ఇచ్చే బహుమతులకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో నామినేషన్లను షార్ట్ లిస్ట్ చేస్తారు. వచ్చే ఏడాది అక్టోబర్లో నోబెల్ బహుమతుల ప్రదానం ఉంటుంది.