హెచ్1బీ వీసాలపై ఊరట ప్రకటన: 'ఇండియన్స్కు మరిన్ని అవకాశాలు'
హెచ్-1బీ వీసాల కట్టడికి కార్యనిర్వాహక ఉత్తర్వులను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ జారీ చేయనున్నారంటూ వచ్చిన వార్తలను భారత అమెరికన్ పారిశ్రామికవేత్త శలభ్ కుమార్ ఖండించారు.
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల కట్టడికి కార్యనిర్వాహక ఉత్తర్వులను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ జారీ చేయనున్నారంటూ వచ్చిన వార్తలను భారత అమెరికన్ పారిశ్రామికవేత్త శలభ్ కుమార్ ఖండించారు. ట్రంప్కు ఆయన మద్దతుదారు.
వీసా కట్టడి ప్రణాళికేవీ అమెరికా ప్రభుత్వం వద్ద లేవని చెప్పారు. షికాగోకు చెందిన కుమార్.. రిపబ్లికన్ హిందు సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాలను విరివిగా చేపడుతుంటారు. వాషింగ్టన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
డొనాల్ట్ ట్రంప్ షాకింగ్ నిర్ణయంపై చంద్రబాబు స్పందన
హెచ్-1బీ వీసాల మీద కార్యనిర్వాహక ఉత్తర్వుపై వైట్ హౌస్లో కసరత్తు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలు నిజం కావన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే ఐటీ ముఖ్య పాత్ర పోషించాలని, ఈ దేశానికి మరింత ఎక్కువమంది ఐటీ నిపుణులు కావాలన్నారు.
ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో తీవ్ర కొరత ఉందని, ఆ ఖాళీలను భారత ఐటీ నిపుణులతో భర్తీ చేస్తారని చెప్పారు. శాశ్వత చట్టబద్ధ నివాసులకు ఇచ్చే గ్రీన్ కార్డుల విషయంలో దేశాలవారీ కోటాను వైట్హౌస్ రద్దు చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల భారత ఐటీ నిపుణులకు మేలు జరుగుతుందన్నారు.
మరోవైపు, కొన్ని దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కుమార్ సమర్థించారు. ఈ నిబంధనలను పాకిస్థాన్ వంటి దేశాలకూ వర్తింప చేయాలన్నారు. ఉగ్రవాదంపై ఆ దేశం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.