ట్రంప్ ఎఫెక్ట్: భూతాపంపై పారిస్ సదస్సు అమలుకు తొలి అడ్డంకి.. లేదంటే కష్టకాలమే
సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు మూడు డిగ్రీలు పెరిగితేనే ఇలా ఉంటే, మరి ఏకంగా 8 డిగ్రీల మేర పెరిగిపోతే పరిస్థితి ఏమిటి? ఈ భూగోళంపై మనిషి జీవించగలడా?
న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్నాయి.. వేసవిలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీలు, 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు మూడు డిగ్రీలు పెరిగితేనే ఇలా ఉంటే, మరి ఏకంగా 8 డిగ్రీల మేర పెరిగిపోతే పరిస్థితి ఏమిటి? ఈ భూగోళంపై మనిషి జీవించగలడా? ముందు ముందు అటువంటి ఉపద్రవం పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
వచ్చే వందేళ్లలో ఈ భూమిని ఖాళీ చేసి వేరే గ్రహాన్ని వెదుక్కోవలసిందేనంటూ ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ముందు ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలి. కర్బన ఉద్గారాలను తగ్గించటం ద్వారా భూతాపాన్ని రెండు డిగ్రీల మేర తగ్గించాలని 2015లో పారిస్లో జరిగిన సదస్సు తీర్మానించింది.
పారిస్ సదస్సు తీర్మానాన్ని సభ్య దేశాలు ఏ మేరకు కార్య రూపంలోకి తీసుకువస్తాయన్న అంశంపైనే భూతాపం నివారణ ఆధారపడి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం భూతాప నివారణ అంతా బోగస్ అని, దానిపై పారిస్ సదస్సు తీర్మానాన్ని ఆమోదించం పొమ్మన్నారు. ఆయన అదే వైఖరికి కట్టుబడి ఉంటే మాత్రం భూతాప నివారణ ఒప్పందంపై నీలినీడలు అలుముకున్నట్లే కనిపిస్తున్నాయి.
పలు ఆరోగ్య సమస్యలకు నిలయం
2100 నాటికి ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఉన్న దానికంటే ఎనిమిది డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు. భూతాపం పెరిగిపోయి, కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోయే నగరాల్లో అధిక కర్బన ఉద్గారాలవల్ల ప్రజాజీవనం అతలాకుతలమవుతున్నది. దీనివల్ల ప్రజలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుండెపోటు, కుంగుబాటు, పార్కిన్సన్ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. 1950 నుంచి 2015 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 1,692 నగరాల వాతావరణ సమాచారం శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
భూగర్భ జలాలు తగ్గిపోవడంతో
భూగర్భ జలాలు తగ్గిపోవడంతో తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. కర్మాగారాల్లో ఉత్పాదకత తగ్గిపోతున్నది. అధిక వేడితో నగరాల్లో ఏర్పడే క్లిష్టమైన పరిస్థితుల వల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) క్షీణిస్తున్నది. కొన్ని దేశాల్లో ఇప్పుడు ఉన్న జీడీపీ 2100 నాటికి 10.9 శాతం మేరకు తగ్గిపోవచ్చునని అంటున్నారు. వీలైతే తగ్గించటానికి ప్రయత్నిస్తే సత్ఫలితాలు లభిస్తాయన్న సంగతి మనిషి చేతుల్లోనే ఉంది. శిలాజ ఇంధనాల (పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్) వినియోగం బాగా తగ్గించాలి. ఈ శతాబ్దాంతానికి అనూహ్యమైన రీతిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని, కొన్ని నగరాల్లో ప్రజల మలమల మాడిపోవలసిందేనని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రధాన సమస్యగా పరిణమించిన పట్టణీకరణ
భూగోళంపై ఒక్క శాతం భూమినే నగరాలు ఆక్రమిస్తున్నాయి. కానీ ప్రపంచ జనాభాలో సగంమంది నగరాల్లోనే నివసిస్తున్నారు. 80 శాతం ఉత్పత్తికి నగరాలే కేంద్రస్థానాలు. పారిశ్రామిక విప్లవం తర్వాత పట్టణీకరణ వేగం పుంజుకోవడంతో దాని ప్రభావం వాతావరణపై పడుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోతున్న నగరాల్లో ఉష్ణోగ్రత పెరుగుదల పట్టణేతర ప్రాంతాలతో పోల్చితే అధికంగా ఉంటున్నది. అధికంగా జనసాంద్రత ఉండటంతోపాటు కాలుష్యం వెదజల్లే వాహనాలు ఎక్కువై.. దాన్ని తగ్గించే చెట్లు తక్కువగా ఉండటం, పరిశ్రమల నుంచి వెలువడే వాయు, రసాయన కాలుష్యం దీనికి కారణాలు. పరిశ్రమలు 78 శాతం విద్యుత్ వినియోగిస్తున్నాయి. కనుక చెట్లు అధికంగా పెంచాలి. భవనాల పైకప్పులకు చల్లబరిచే రంగులను వినియోగించాలి. తద్వారా 0.8 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత తగ్గించొచ్చు.
ఉష్ణోగ్రతల తగ్గింపుతోనే సత్ఫలితాలు
బొగ్గు, ఆయిల్, గ్యాస్ మండించటం ద్వారా 60 శాతం బొగ్గు పులుసు వాయువును పట్టణ ప్రాంతాలు ఉత్పత్తి చేస్తున్నాయి. 2050 నాటికే పలునగరాల్లో ఉష్ణోగ్రతలు కనీసం రెండు డిగ్రీలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1950 నుంచి 2015 మధ్య ప్రపంచ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని 65 శాతం జనాభా 0.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత బారీన పడ్డారు. వీలైతే ఈ ఉష్ణోగ్రతలు తగ్గించటానికి ప్రయత్నిస్తే సత్ఫలితాలు లభిస్తాయన్న సంగతి మనిషి చేతుల్లోనే ఉంది. శిలాజ ఇంధనాల (పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్) వినియోగం బాగా తగ్గించాలి. కాలుష్య నివారణకు దూరంగా ఉండాలి. చెట్లు అధికంగా పెంచాలి. భవనాల పైకప్పులకు చల్లబరిచే రంగులను వినియోగించాలి. తద్వారా 0.8 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత తగ్గించొచ్చు.