అమెరికాకు చైనా షాక్, ట్రేడ్ వార్ కాదని ట్రంప్: వాణిజ్య యుద్ధంతో భారత్కు లాభం!
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు ఏవీ తగ్గడం లేదు. తాజాగా, ట్రంప్ సుంకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా.. 106 వస్తువులపై 25 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది.ట్రంప్ సుంకాలపై చైనా మళ్లీ తీవ్రంగా స్పందించింది.
సోయాబీన్స్, ఆటోలు, రసాయనాలు, విమానాలు, మొక్కజొన్న ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు ఈ జాబితాలో ఉన్నట్లు చైనా బుధవారం వెల్లడించింది. మద్యం, సిగరెట్లు, పొగాకు, కొన్ని రకాలు ఎద్దు మాంసం, అమెరికా నారింజ జ్యూస్, లూబ్రికెంట్లు, ప్లాస్టిక్ వస్తువులు, గోధుమలు, పత్తి, ట్రక్కులు, ఎస్యూవీ కార్లు కొత్త సుంకాల జాబితాలోకి తెచ్చినట్లు పేర్కొంది. అమెరికాకు చైనా గట్టి సమాధానం ఇవ్వడంతో ట్రేడ్ వార్ భయాలు తీవ్రరూపం దాల్చాయి.
తొలుత ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ గత నెలలో ప్రకటించారు. దీంతో ట్రేడ్ వార్ మొదలైంది. వెంటనే స్పందించిన చైనా ధీటుగా అమెరికా వస్తువులపై దిగుమతి సుంకం పెంచింది. ట్రంప్ రెండు రోజుల క్రితం 50 మిలియన్ డాలర్ల విలువైన 1300 చైనా ఉత్పత్తుల పన్నులు ప్రకటించారు. దీంతో చైనా తాజాగా మరిన్ని వస్తువులపై సంకం పన్ను విధించింది.
చైనాతో ట్రేడ్ వార్ కాదు: ట్రంప్
చైనాతో తాము చేస్తోంది ట్రేడ్ వార్ కాదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మా వాళ్ల అవివేకం వల్ల ఇన్నాళ్లు నష్టపోయామని, ఇక ఆటలు సాగనివ్వమని చెప్పారు. గతంలో అమెరికాను పాలించిన మూర్ఖులు, చేతకాని నాయకుల వల్ల చాలా ఏళ్ల కిందట ఆ యుద్ధంలో ఓడిపోయామని, ప్రస్తుతం తమకు 500 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్య లోటు ఉందని, మేధోసంపత్తి చౌర్యం ద్వారా మరో 300 బిలియన్ డాలర్లు ఎక్కువ అవుతుందని, ఈ పరిస్థితిని కొనసాగినివ్వమని, ఎప్పుడైతే నువ్వు 500 బిలియన్ డాలర్ల లోటులో ఉన్నావో ఇంకా ఓడిపోవడానికి అవకాశం లేదన్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా - చైనా ట్రేడ్ వార్ భారత్కు లాభం చేకూరుస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో భారత్ రెండు మార్కెట్లలోను తమ ప్రాతినిథ్యం పెంచుకునే అవకాశముందని అంటున్నారు.
అమెరికా - చైనా ట్రేడ్ వార్ కారణంగా ఒకరిపై మరొకరు సుంకాలతో యుద్ధం చేస్తుంటారని, ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలకు, వ్యాపారవ్యాప్తికి దోహదం చేస్తుందని అంటున్నారు.