కరోనా విలయం: అమెరికా సంచలనం.. WHOకు కటీఫ్ చెప్పిన ట్రంప్.. ఇండియాపై యూటర్న్.. అగ్రరాజ్యం ఆగమాగం
యుద్ధ సమయంలోనే పాలకుడి సత్తా ఏంటో తెలిసొస్తుంది. ఇప్పుడు శత్రువు కంటికి కనిపించని కరోనా వైరస్. మహమ్మారి బారి నుంచి సొంత ప్రజల్ని కాపాడుకోలేక తీవ్రఅసహనానికి లోనవుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. కొవిడ్-19 చికిత్సకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్ మందుల విషయంలో ఇండియాను బెదిరించిన ఆయన.. కొద్ది గంటలకే స్వరం మార్చారు. కానీ అంతలోనే, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కు కటీఫ్ చేప్పారు. ప్రపంచమంతా కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతున్నవేళ.. WHOకు అమెరికా నిధులు ఆపేయడం ద్వారా యావత్ మానవాళికీ ట్రంప్ తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అగ్రదేశం ఆగమాగం..
ప్రస్తుతం అమెరికాలో ఏ నగరంలో చూసినా శవాల గుట్టలే. స్మశానాల్లో ఖాళీ లేదు. మృతుడి వెంట బంధువులు కూడా రాలేని పరిస్థితి. సంబంధిత శాఖల సిబ్బందే అంత్యక్రియలు పూర్తిచేస్తున్నారు. బుధవారం ఉదయం నాటికి అమెరికాలో కొవిడ్-19 పేషెంట్ల సంఖ్య 4లక్షలు దాటింది. అందులో మరణించినవారి సంఖ్య 13వేలకు చేరువైంది. మంగళవారం ఒక్కరోజే దాదాపు 2వేల మరణాలు సంభవించడం విషాదకరం. ఇంకా 10వేల మంది పేషెంట్లు క్రికల్ కండిషన్ లో ఉండటం, కొత్త కేసులు కూడా భారీగానే నమోదవుతుండటం విచారకరం. ఇంతటి భయానక స్థితిలోనూ ప్రెసిడెంట్ ట్రంప్ రాజకీయాలు చేస్తుండటంపై అక్కడి ప్రజలు, మీడియా మండిపడుతున్నారు.
WHOకు నిధులు బంద్..
ఐక్యరాజ్యసమితి ప్రధానాంగాల్లో ఒకటైన ప్రపంచ ఆరోగ్య సంస్థకు అతిపెద్ద దాతా అమెరికానే. ఆ సంస్థకు వచ్చే నిధుల్లో మెజార్టీ వాటా యూఎస్ నుంచే వస్తుంది. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న అసాధారణ నిర్ణయంతో WHO మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ విషయంలో WHO అడుగడుగునా చైనా పక్షపాతిగా వ్యవహరించిందని, తద్వారా అమెరికాను దారుణంగా మోసం చేసిందని ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు, WHO తీరుపై దర్యాప్తు నిమిత్తం సెనేట్ ద్వారా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కరోనా విలయం మొదలైనప్పటి నుంచే WHOను బెదిరిస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడేకంగా నిధుల నిలిపివేతకు ఆదేశిలచ్చి అన్నంతపనీ చేశారు.
సంచలన ఆరోపణలు..
‘‘కరోనా వైరస్ పుట్టుక దగ్గర్నుంచి అది వ్యాపించే తీరు, సృష్టించే విలయం గురించి WHO దగ్గర చాలా సమాచారం ఉంది. కానీ, చైనా అనుకూల వైఖరి కారణంగానే దాన్ని వాళ్లు బయటపెట్టలేదు. మొదట వూహాన్ ను లాక్ డౌన్ చేసినప్పుడే.. విదేశీ ప్రయాణాలను నిలిపేయాలని నేను అనుకున్నాను. కానీ నా నిర్ణయాన్నిWHO తప్పుపట్టింది. దాని ఫలితం ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు మనమంతా అనుభవిస్తున్నాం. ఆ సంస్థ ఒక్క అమెరికానేకాదు, ప్రపంచ దేశాలన్నింటినీ తప్పుదారిపట్టింది. అలాంటి సంస్థకు ఇకపై ఒక్క డాలర్ కూడా ఇచ్చేది లేదు''అని ట్రంప్ ఆరోపించారు. ఇదిలాఉంటే,
ఇండియాను బెదిరించలేదట..
కొవిడ్-19కు ఇంకా మందు కనిపెట్టని స్థితిలో, మలేరియా చికిత్సకు వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్', జ్వరానికి వాడే ‘పారాసిటమాల్' డ్రగ్స్ ను ప్రత్యామ్నాయాలుగా వాడుతున్నారు. దీంతో ఆ రెండు డ్రగ్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఇండియా ఒక్కటే ఆ మందుల్ని తయారుచేస్తున్నందున అమెరికాతోపాటు దాదాపు 30 దేశాలు ప్రధాని మోదీకి ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నాయి. డ్రగ్స్ పంపకుంటే ఇండియాపై ప్రతీకారం తప్పదని ట్రంప్ బెదిరించడం వివాదాస్పదమైంది. అయితే, కొద్ది గంటల్లోనే ట్రంప్ యూటర్న్ తీసుకుని.. తాను ఇండియాను బెదిరించలేదని వివరణ ఇచ్చారు.
నాకు బ్యాడ్ న్యూస్ నచ్చవు..
‘‘మీ అందరికీ తెలుసు, నేను గుడ్ న్యూస్ వినడానికే ఇష్టపడతాను. బ్యాడ్ న్యూస్ అసలు నచ్చవు. ఇండయా నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. వాళ్లు హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్సీక్యూ) ఎగుమతిపై నిషేధాన్ని తొలగించారు. ముందుగా తమవాళ్ల కోసం ఆ మందును అందుబాటులో ఉంచడానికే ఆయన(మోదీ) ఎగుమతులపై నిషేధం విధించారు. నేను ఇప్పటికే 29 మిలియన్లకు పైగా హెచ్సీక్యూ డోసులు కొనుగోలు చేశా. అది కూడా ఎక్కువ శాతం ఇండియా నుంచి వచ్చిందే. నిజానికి అమెరికాకు ఆ మందులు చాలా అత్యవసరం కాబట్టే పంపుతారా? లేదా? అని అడిగాను తప్ప బెదిరించలేదు. మోదీ చాలా మంచి మనిషి. నా మాట ప్రకారం మందుల్ని పంపుతున్నారు''అని ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతకుముందు వైట్ హౌజ్ మీడియా సమావేశలో ట్రంప్ బెదిరింపు కామెంట్స్ చేసిన ప్రశ్నకూడా వేరేదని, ఇండియాకు సంబంధించింది కాదని వెల్లడైంది.
ఆదుకున్న ఇండియా..
విపత్కర సమయంలో రాజకీయాలు తగదని అమెరికాకు హితవుపలికిన ఇండియా.. తాము ముందుజాగ్రత్తగానే ఆ రెండు మందుల ఎగుమతులను నిషేధించామని, ఇప్పుడు మానవతా దృక్ఫథంతో ఎగుమతులకు పాక్షికంగా అనుమతులిచ్చామని విదేశాంగ శాఖ ప్రకటించింది. ముందుగా భారత్ పై ఆధారపడ్డ పొరుగుదేశాలు, ఆ తర్వాత అమెరికాలాంటి దేశాలకు మందులు పంపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎగుమతులకు సంబంధించిన అనుమతి ఉత్తర్వులు హుటాహుటిన జారీ చేశారు. శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ లాంటి పొరుగుదేశాలతోపాటు అమెరికా, యూరప్ దేశాలకు కూడా ఒకటిరెండు రోజుల్లో హైడ్రాక్సీ క్లోరోక్వీన్, పారాసిటమాల్ డ్రగ్స్ చేరుకోనున్నాయి.