ఇద్దరు మిత్రులు: జూలై 16న ట్రంప్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశం
అమెరికా రష్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే ఈ విబేధాలను పక్కకుబెట్టి శాంతి మంత్రం జపించేందుకు ఇరుదేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం, ద్వైపాక్షిక బంధం బలోపేతంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే రష్యా అమెరికా అధ్యక్షుడు శిఖరాగ్ర చర్చలు జరిపేందుకు ముందుకొచ్చారు. జూలై 16న ట్రంప్ పుతిన్లు భేటీ కానున్నారు. ఇందుకు ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీ వేదిక కాబోతోంది. ట్రంప్ పుతిన్ల భేటీ జూలై 16న జరుగుతుందని ఇప్పటికే ఇటు వైట్ హౌజ్ అటు క్రెమ్లిన్ స్పష్టమైన ప్రకటనను విడుదల చేశాయి.
ట్రంప్ పుతిన్ల సమావేశం సందర్భంగా పలు అంతర్జాతీయ అంశాలు చర్చకు రానున్నాయి. అంతేకాదు అమెరికా రష్యా సంబంధాలు, ప్రస్తుత పరిస్థితిపై భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. వీరి చర్చల అనంతరం ట్రంప్ పుతిన్లు కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం.
ట్రంప్ పుతిన్ సమావేశం తేదీ ఖరారు కోసం అమెరికా జాతీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ పుతిన్తో సమావేశమయ్యారు. పుతిన్ జూలై 16వ తేదీ సమావేశానికి ఓకే చెప్పడంతో అదే తేదీని ఇరుదేశాలు అధికారికంగా ధృవీకరించాయి. బోల్టన్తో సమావేశం చాలా స్మూత్గా సాగిందని, ప్రపంచ వ్యాప్తంగా స్థిరత్వానికి ఈ సమావేశం బాటలు వేస్తుందని తాను భావిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. 2017లో జూలైలో జీ-20 సదస్సు సందర్భంగా జర్మనీలో ట్రంప్-పుతిన్లు భేటీ అయినప్పటికీ పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదు. జూలై 11,12 తేదీల్లో బెల్జియంలోని బ్రెసెల్స్ జరిగే నాటో సదస్సు తర్వాత ట్రంప్ పుతిన్ల సమావేశం జరగనుంది.