కశ్మీర్ అంశంపై ట్రంప్ ఆసక్తి : మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం..కండీషన్స్ అప్లై
వాషింగ్టన్: కశ్మీర్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారని అయితే ఇందుకు భారత్ పాక్లు ముందుకు వచ్చి ట్రంప్ను కోరాల్సి ఉందని అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అంతకంటే ముందు ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. భారత్ పాకిస్తాన్ల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొని ఉందన్న విషయం అమెరికా అధ్యక్షుడికి తెలుసన్నారు.
ఈ క్రమంలోనే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమతో చెప్పారని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్లతో కశ్మీర్ అంశాన్ని చర్చించారని చెప్పారు. అయితే కశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసినట్లు ఆ అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు.
ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ దేశాలమధ్య మంచి వాతావరణంలో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగేందుకు అమెరికా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అంతకంటే ముందు ఉగ్రవాదంను తమ గడ్డపై లేకుండా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పాకిస్తాన్ చెప్పాల్సి ఉంటుందని అమెరికా ఉన్నతాధికారి చెప్పారు.పాక్ గడ్డపై ఉగ్రవాదం ఉండటంతోనే రెండు దేశాల మధ్య చర్యలకు విఘాతంగా మారిందని వెల్లడించారు.
రెండు దేశాలు ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కోరితే సమస్యను పరిష్కరిస్తారని అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు. ఇక కర్తాపూర్ కారిడార్కు సంబంధించి ఇరుదేశాలు సంతకాలు చేయడాన్ని అమెరికా స్వాగతించింది. ఇక చర్చలకు ఈ సంతకాలే తొలి అడుగులు కావాలని అమెరికా ఆకాంక్షించింది.
చర్చలు ఉగ్రవాదం రెండు ఒకే పడవపై ప్రయాణించలేవన్న భారత్ మాటలను అమెరికా సమర్థిస్తుందా అన్న ప్రశ్నకు పాకిస్తాన్ ఉగ్రవాదం అణిచివేతకు కఠినచర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. రెండు అణుదేశాలు పక్కపక్కనే ఉన్న సమయంలో యుద్ధం కన్నా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటేనే బాగుంటుందని చెప్పారు.
ఇక హౌడీ మోడీ కార్యక్రమం గురించి మాట్లాడిన ఉన్నతాధికారి... రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేయడమే కాకుండా రెండు దేశాల స్నేహబంధాన్ని మరింత ధృడంగా మార్చిందని వ్యాఖ్యానించారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గత రెండున్నరేళ్లుగా బాగా పెరుగుతూ ఉందని చెప్పారు.