మరో మాటే లేదు! వెనక్కిపంపేయడమే: అక్రమవలసదారులపై ట్రంప్ తేల్చేశారు
వాషింగ్టన్: అక్రమవలసదారులపై అమెరికా అధ్యక్షుడు మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తే.. కోర్టులు, కేసులు ఏమీ వొద్దని, తక్షణమే వెనక్కి పంపించేయాలని ట్రంప్ స్పష్టం చేశారు. వారిపై న్యాయ విచారణ జరపాల్సిన అవసరం కూడా లేదని, చట్టప్రకారం ఉన్న న్యాయ విచారణ ప్రక్రియను తొలగించేయాలని ట్రంప్ తేల్చేశారు.
'మన దేశంలోకి ఈ ఆక్రమణదారులను మేం అనుమతించలేము. ఎవరైనా అక్రమంగా వస్తే.. జడ్డీలు, కోర్టులు, కేసులు ఏమీ లేకుండా తక్షణమే వారిని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయాలి. మన వ్యవస్థ మంచి ఇమ్మిగ్రేషన్ పాలసీని, శాంతిభద్రతలను అపహాస్యం చేస్తోంది’ అని అన్నారు.
అంతేగాక, 'చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా వస్తున్నారు. విచారణకు ఏళ్ల సమయం పడుతోంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే వలసలు ఉండాలి. అమెరికాను తిరిగి గొప్పగా మార్చే ప్రజలు కావాలి' అని ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
సరిహద్దుల వద్ద అక్రమంగా ప్రవేశించిన వారి నుంచి పిల్లలను వేరు చేసే విధానంపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్రంప్ ఇటీవల వెనక్కి తగ్గి ఆ విధానానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే దాదాపు 500 మంది చిన్నారులు వారి కుటుంబసభ్యుల దగ్గరికి చేరారు. కాాగా, మెక్సికో, మధ్య అమెరికాతో ఉన్న సరిహద్దు వద్ద ప్రతినెలా వందల, వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ వారిపై చర్యలు తీసుకుంటున్నారు.