ట్రంప్ తప్పుకోకపోవడంతో ప్రపంచానికి తప్పుడు సంకేతాలు - బైడెన్ ఆందోళన
అమెరికాలో హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్ పదవి వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికీ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా అధికారం చెలాయిస్తున్న తొలి అధ్యక్షుడుగా ట్రంప్ మిగిలిపోతున్నారు. వాస్తవంగా ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బైడెన్ మాత్రం ట్రంప్ ఎప్పుడు అధికార పీఠం వదిలిపెడతారా అని నిస్సహాయంగా ఎదురుచూడాల్సిన పరిస్ధితి. దీంతో ఆయనలోనూ అసహనం పెరుగుతోంది.
అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమి అంగీకరించపోవడం, తమకు అధికారం అప్పగించడానికి ట్రంప్ సిద్ధం కాకపోవడంతో ప్రపంచానికి తప్పుడు సందేశం వెళుతోందని బైడెన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ బాధ్యతారాహిత్యాన్ని అమెరికన్లు కళ్లారా చూస్తున్నారు. మిగతా ప్రపంచానికి ప్రజాస్వామ్యం పనితీరుపై తప్పుడు సంకేతాలు కూడా వెళ్తున్నాయంటూ బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా నియంత్రణ చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న బైడెన్ తాజాగా తమ పార్టీకి చెందిన గవర్నర్లతో భేటీ అయ్యారు. కరోనా వ్యాక్సిన్ రాగానే వెంటనే పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన "ఆపరేషన్ వార్ప్ స్పీడ్"ను అమలు చేసేందుకు బైడెన్-కమలా హ్యారిస్ ద్వయం సన్నాహాలు చేస్తున్నారు.
ట్రంప్ చర్యలపై స్పందించిన బైడెన్ ఆయనకు వంతపాడుతున్న రిపబ్లికన్ గవర్నర్లపై న్యాయపరమైన చర్యల కంటే వారితో కలిసి పనిచేసేందుకే తాను మొగ్గుచూపుతానని తెలిపారు. కానీ ట్రంప్ను, ఆయనకు మద్దతుగా నిలుస్తున్న జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ను మాత్రం కోర్టులో నిలబెడతానని బైడెన్ హెచ్చరించారు.
Recommended Video
చివరిగా ఓట్ల లెక్కింపు సాగుతున్న మిచిగాన్ రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రజాప్రతినిధులను వైట్హౌస్కు పిలిపించుకున్న ట్రంప్... వారితో ఎన్నికల ఫలితాల తారుమారుపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అక్కడ లక్షన్నర ఓట్ల మెజారిటీతో ఉన్న బైడెన్ మాత్రం ట్రంప్ ఎత్తులేవీ పనిచేయబోవని చెబుతున్నారు. మిచిగాన్ను తాము ఎప్పుడో గెలిచామని, దాన్ని ధృవీకరించడం ఒక్కటే మిగిలుందన్నారు.