సిలికాన్ వ్యాలీకీ దెబ్బే: కెనడా వైపు టెక్కీల చూపు.. నిబంధనలు ‘జస్టిన్ ట్రూడస్’ సరళతరం
వాషింగ్టన్ /న్యూఢిల్లీ / హైదరాబాద్: గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి హెచ్ -1బీ వీసాల గడువు పొడిగించకూడదన్న అమెరికా ప్రభుత్వం ప్రతిపాదన అక్కడి భారతీయ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే సుమారు 5లక్షల నుంచి 7.5లక్షల మంది హెచ్-1బీ వీసా ఉద్యోగులు భారతదేశానికి పయనించక తప్పని పరిస్థితి నెలకొంది.
'బై అమెరికన్. హైర్ అమెరికన్' నినాదంతో ముందుకు వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా నియమాలను మరింత కఠినతరం చేస్తున్నారు. అమెరికాలో భారత్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. మరీ ముఖ్యంగా తెలుగువారి పరిస్థితి అగమ్య గోచరమే.
దీనివల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. నైపుణ్యం గల వలసదారులపై ట్రంప్ కఠిన ఆంక్షలు విధిస్తుండగా, మరోపక్క అలాంటి వారి కోసమే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడస్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తూ నిబంధనలు సరళతరం చేశారు.
కేవలం జూన్ నుంచి నాలుగు నెలల కాలంలోనే రెండు వేల మందికి కెనడా వీసాలు మంజూరయ్యాయి. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని తరిమేయాలన్న అమెరికా ప్రయత్నాల వల్ల సిలికాన్ వ్యాలీకీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య రెండు వేల వీసాలు జారీ ఇలా
‘హైటెక్ వీసాలపై ట్రంప్ నిర్లక్ష్యం.. ట్రూడస్ స్వాగతం' పేరిట గత డిసెంబర్లోనే బ్లూమ్బెర్గ్ నివేదికను ప్రచురించింది. ఈ మేరకు వీసాల విషయంలో కెనడా ప్రభుత్వం నిబంధనలను మరింత సరళతరం చేసిందని, అంతేకాదు వీసా జారీ సమయాన్ని తగ్గించింది. కేవలం దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి వీసాను మంజూరు చేస్తోందని తెలిపింది. గతంలో వీసా జారీకి నెలల సమయం పట్టేది. తాజా కార్యక్రమం కింద గతేడాది జూన్ 12 నుంచి సెప్టెంబర్ 30 తేదీల మధ్య రెండు వేల మందికి వీసాలను ఇప్పటికే జారీచేసింది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సుమారు 7.5లక్షల మంది భారతీయులకు కెనడా స్వర్గధామం కానుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. చైనా, ఫ్రాన్స్ల తర్వాత అత్యధిక వీసాలను జారీ చేసిన దేశం కూడా కెనడానే. గతేడాది 3,20,000మంది కొత్త వారిని కెనడా ఆహ్వానించింది.
భారత్లో విస్తరణ దిశగా స్టాండర్డ్ చార్టర్డ్, డియాజియో తదితర సంస్థలు
నిబంధనల కఠినతరంతో భారత ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయాలు చూసుకోవల్సి రావడం ఆందోళనకరమైనా.. ఈ నిబంధన అమలులోకి వస్తే పది లక్షల మందికి పైగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ల కొరత అమెరికాకు ఏర్పడుతుందని అంచనా. ‘ఫస్ట్ హైర్ అమెరికన్' నినాదాన్ని అమలు చేయాలన్నా.. సరిపడా అమెరికన్ ఐటి.. కంప్యూటర్ సైన్స్ నిపుణులు లేరు మరి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ భారత్ నుంచి వచ్చిన ఐటీ వర్కర్లు.. వారి ‘హెచ్ -1బీ' వీసాదారులపైనే ఆధారపడి ఉన్నాయి మరి. స్టాండర్డ్ చార్టర్డ్, డియాజియో, స్విస్ బ్యాంక్ యూబీఎస్ వంటి పలు గ్లోబల్ సంస్థలు తమ సర్వీసులను భారతదేశంలోని స్థానికుల ప్రతిభను వినియోగించుకునే దిశగా విస్తరిస్తున్నాయి. అమెరికా విద్యుత్ దిగ్గజం ‘జనరల్ ఎలక్ట్రిక్' ప్రపంచంలోని తన రిసెర్చ్, డెవలప్ మెంట్ సెంటర్లను మూసేసి అమెరికా, భారతదేశాల్లో మాత్రమే విస్తరించడంపై ఫోకస్ పెట్టింది.
ట్రంప్ ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తుందని ఆశాభావం
అమెరికా ప్రతిపాదనలు హెచ్-1బీ వీసాలు కలిగిన భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతాయని బ్లూమ్బెర్గ్ నివేదిక చెబుతోంది. దశాబ్దకాలంగా గ్రీన్కార్డుల కోసం ఎంతో మంది భారతీయులు ఎదురు చూస్తున్నారని వారిపైనా పెను ప్రభావం పడుతుందని ఒబామా ప్రభుత్వంలో డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్గా పనిచేసిన లియాన్ ఫ్రెస్కో అంటున్నారు. సుమారు 10 లక్షలమంది హెచ్-1బీ వీసా కలిగిన వారు గ్రీన్కార్డు కోసం వేచి చూస్తున్నారని అన్నారు. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే సుమారు 5లక్షల నుంచి 7.5లక్షల మంది బారతీయులు స్వదేశానికి వెళ్లిపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.హెచ్-1బీ వీసాలు కలిగిన వారి విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని బ్లూమ్బెర్గ్ నివేదిక చెబుతోంది.
గ్రీన్ కార్డు కావాలంటే ‘ఈబీ - 5' వీసా మేలన సూచనలు
గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసినా హెచ్ 1 బీ వీసాదారులు కేవలం ఆరు నెలలు మాత్రమే ఉండాలన్న తాజా ప్రతిపాదనలను అమెరికా వెంటనే అమల్లోకి తీసుకురాకపోవచ్చని చెబుతోంది. గడువు ముగిసిన వీసాలను మరో మూడేళ్లు పొడిగించవచ్చని అంటోంది. అమెరికాలో ఉన్న భారతీయ టెక్ నిపుణుల్లో భయం, ఆందోళనలు రేకెత్తించి వారంతట వారే దేశం విడిచి వెళ్లేందుకు ఇలాంటి ఆలోచనలను తెస్తున్నారని హోమ్ల్యాండ్ సెక్యురిటీ అధికారి ఒకరు వ్యాఖ్యనించారు. ఇదే సమయంలో గ్రీన్కార్డు పొందాలనుకునే భారతీయులకు ఈబీ-5 వీసా ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 5లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టడంతో పాటు, 10మంది అమెరికన్లకు ఉపాధి చూపిస్తే సులభంగా గ్రీన్కార్డు పొందవచ్చని సూచిస్తున్నారు.
ఐటీ రంగం బలహీన పడకుండా అమెరికా ముందుజాగ్రత్త చర్యలు
నాస్కామ్ నివేదిక ప్రకారం, గత రెండేళ్లుగా భారతీయ ఐటీ ఉద్యోగులకు వీసాల మంజూరు 50శాతం వరకూ తగ్గింది. తమ ఐటీ రంగం బలహీనం కాకుండాఉండేలా అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకొంటోంది. స్థానికంగా యువతను ప్రోత్సహిస్తూ వారికోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది.‘హెచ్1బీ వీసాలపై నిబంధనలను కఠినతరం చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా భారతీయ ఐటీ కంపెనీలపై పడుతుంది. కానీ భారతదేశంలోని ఐటీ కంపెనీలకు డిమాండ్ పెరిగే అవకాశముందని' రీసెర్చ్ అనెలిస్ట్ సీఈవో సంచిత్ వీర్ గోగ్లా అంటున్నారు. హెచ్1బీ వీసాల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ బిల్లులో కఠిన నిబంధనలను తేనున్నారు. వీసా ఆధారిత కంపెనీలను కట్టుదిట్టం చేయటమే దీని లక్ష్యం. హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉందని ట్రంప్ ప్రభుత్వం వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్ అన్నారు. అమెరికాలో ఐటీ రంగంలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. భారతీయ ఐటీ నిపుణుల ప్రతిభ మనకు అనుకూలాంశం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
కేంద్రం జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనలు ఇలా
హెచ్ 1 బీ వీసా దారులు ఆరేళ్లు మాత్రమే ఉండాలన్నది ప్రస్తుతం ఒక ప్రతిపాదనేనని గ్లోబల్ టరీ కన్సల్టెన్సీ డైరెక్టర్ శుభాకర్ అన్నారు. ముందుగా హౌస్ కమిటీలో...తర్వాత సెనెట్లో బిల్లు పాస్ కావాలని గుర్తు చేశారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సంతకం చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని గతంలో చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ఒక వేళ అమలై..లక్షల మంది ఐటీ నిపుణులను వెనక్కి పంపితే అమెరికా ఎలా మనగలుగుతుందని ప్రశ్నించారు. అమెరికా పౌరుల్లో ఐటీ పరిజ్ఞానం తక్కువ. అంతేకాకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని, భవిష్యత్తులో మాత్రం కొంత ఇబ్బంది తప్పదన్నారు. ప్రస్తుతం వేల మంది గ్రీన్కార్డుకు దరఖాస్తు చేసి...పెండింగ్లో ఉన్నా ఉద్యోగం చేస్తున్న భారతీయులు లక్షల్లోనే ఉన్నారని సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపక కార్యనిర్వాహక సంచాలకుడు కన్నెగంటి రమేశ్ అన్నారు. తాజా సవరణ కార్యరూపంలోకి వస్తే అమెరికాలో ఆరేళ్ల కంటే హెచ్-1బీపై ఉండటం కుదరదని చెప్పారు. ఇది ఎక్కువగా భారత్, చైనాలపై ప్రభావం ఉంటుందని కన్నెగంటి రమేశ్ స్పష్టం చేశారు. లక్షల మంది అక్కడ ఉద్యోగం చేయడం వల్ల మన వాళ్లకు ఎంత ఆర్థిక ప్రయోజనం ఉంటుందో నిపుణుల సేవలవల్ల ఆ దేశానికి కూడా అంతకంటే ఎక్కువే ఉంటుందని, కేంద్రం వీటిపై సంప్రదింపులు జరిపి భారతీయులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు.
హెచ్ -1 బీ వీసా కోసం ఐటీ నిపుణుల్లో పోటీ తప్పదా?
హెచ్1బీ వీసాలు ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యే విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదన హైదరాబాదీల్లో కలకలం రేపుతోంది. తమ వారిలో ఎంత మందికి గ్రీన్ కార్డు వస్తుంది, మరెంత మంది తిరుగు ముఖం పట్టాల్సి వస్తోందనన్న ఆందోళన అటు అమెరికాలో ఉన్న వారితోపాటు భాగ్యనగర వాసుల్లో కుటుంబ సభ్యుల్లో కనిపిస్తోంది. తాజా ప్రతిపాదన అమలైతే హెచ్1బీ వీసా కోసం మరింత పోటీ పెరుగుతుంది. నైపుణ్యం ఉన్న వారికే అవకాశం కాబట్టి- స్కిల్డ్ వర్కర్లను పెద్ద జీతాలకు తీసుకుని వారికి హెచ్1-బీ వీసాలు లభించేట్లు చేయడానికి పెద్ద పెద్ద కంపెనీలు ప్రయత్నిస్తాయని, మిగిలిన వారిలో విపరీతమైన పోటీ ఏర్పడి అమెరికా వెళ్లేందుకు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు తలెత్తే పరిస్థితులు వస్తాయని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి కిశోర్ తెలిపారు. తాజా పరిణామాలు ఐటీ నిపుణుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. అమెరికాకే ఎక్కువ నష్టం అని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ శాఖ చైర్మన్ కే మోహన్ రాయుడు తెలిపారు. ‘అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారంతా ఆయా రంగాల్లో నిపుణులే. వారంతా అక్కడి నిబంధనల ప్రకారం భారత్కు వస్తే పని చేసేదెవరు' అని కే మోహన్ రాయుడు ప్రశ్నించారు.