కరోనా వేళ అమెరికా భయానక ఎత్తుగడ.. కిమ్ జాంగ్ కూడా అదే ప్లాన్.. వినాశకాలే విపరీత బుద్ధి..
ప్రపంచమంతా కరోనా ధాటికి కుదేలైపోయిన వేళ.. రెండు దేశాలు మాత్రం భయానక పన్నాగాలు సిద్ధం చేస్తున్నాయి. వ్యవహారంలో పరస్పరం శత్రుదేశాలే అయినప్పటికీ.. వాటి అధినేతలిద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. ట్రంప్ ఏలుబడిలోని అగ్రరాజ్యం.. 28 ఏళ్ల తర్వాత అణ్వాయుధ పరీక్షలకు సిద్ధపడుతుండగా.. శాంతి చర్చలు నిలిచిపోయాయన్న సాకుతో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ తన అణుకార్యక్రమాలను మొదలుపెట్టాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏకకాలంలో వీళ్లిద్దరూ వినాశనం దిశగా అడుగులు వేస్తున్నారని అణు విశ్లేషకులు అంటున్నారు.
Recommended Video
డాక్టర్
సుధాకర్
సంచలన
వాగ్మూలం..
లేడీ
కానిస్టేబుల్తో
అలా
చేయించి..
అర్ధనగ్నంగా
మార్చారంటూ..
ట్రంప్ తెంపరితనం..
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. చైనాపై ఎదురుదాడి మొదుపెట్టారన్న వాదన తొలి నుంచీ వింటున్నదే. ఆ క్రమంలో ఐక్యారాజ్యసమితిని, భారత్ లాంటి దేశాలను సైతం అనుకూలంగా మార్చుకున్న చైనాపై ఒత్తిడి పెంచి, వైరస్ పై దర్యాప్తునకు అంగీకరించేలా చేశారు. అయితే ఆయన చర్యలేవీ అమెరికన్లను పెద్దగా ఆకట్టుకోకపోవడం, నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తుండటంతో మరో మ్యాజిక్ చేసి చూపించాలని ఆయన డిసైడైనట్లు తెలిసింది. దాని వెనుకా కొన్ని లాజిక్స్ లేకపోలేవు..
28 ఏళ్ల తర్వాత అణుపరీక్షలు..
ప్రపంచ పెద్దన్న ముసుగులో అన్ని దేశాలపై కర్రపెత్తనం చేసే అమెరికా.. శత్రుదేశాలపై సాధారణంగా ప్రయోగించే పదం.. అణ్వాయుధం. అణ్వస్త్రాలు, జీవాయుధాలు ఉన్నాయనే కారణంతో అఫ్ఘానిస్తాన్, ఇరాక్ లాంటి దేశాలను నేలమట్టం చేసిన అమెరికా.. ఆ ఆయధాలు కలిగున్న ఇరాన్, ఉత్తరకొరియాలపై భరించలేని స్థాయిలో ఆంక్షలు కొనసాగిస్తుండటం తెలిసిందే. చివరిసారిగా 1992లో అణుపరీక్షలు నిర్వహించిన అమెరికా.. మళ్లీ 28 ఏళ్లకు స్వీయసత్తాను చాటుకునేందుకు రెడీ అవుతోంది. మే 15న ఉన్నతస్థాయి సమావేశంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ మేరకు అంతర్గత చర్చలు ప్రారంభించినట్లు ప్రఖ్యాత ‘వాషిగ్టన్ పోస్ట్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
రెచ్చగొట్టినందుకే..
ట్రంప్ అణుపరీక్షలకు రెడీ అవుతోన్న మాట వాస్తవమేనంటూ, మే 15నాటి మీటింగ్ లో పాల్గొన్న కీలక అధికారుల వివరణను కూడా వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. అణ్వాయుధాల నిర్వీర్యం కోసం చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా ఇటీవల చైనా, రష్యా రహస్యంగా న్యూక్లియర్ టెస్టులు నిర్వహించాయని, ఈ విషయం తెలిసిన వెంటనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని, ఆ రెండు దేశాలకు గట్టి వార్నింగ్ ఇవ్వడానికైనా మనమూ అదే పని చేద్దామని అమెరికా ప్రెసిడెంట్ అన్నట్లు సదరు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే..
అదే జరిగితే..
అణ్వాయుధ పరీక్ష చేయాలన్న ఐడియాపై చర్చ మొదలైనప్పటికీ.. దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోలేదని, మళ్లీ చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేమని అధికారులు పేర్కొన్నట్లు పోస్ట్ కథనంలో రాశారు. ఈ వార్తలపై అణ్వాయుధాల నిర్మూలన కోసం అంతర్జాతీయ ఉద్యమం (ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ - ఐసీఏఎన్) నేతలు స్పందించారు. ‘‘ట్రంప్ చేయబోయే పిచ్చి పనితో ఇప్పటిదాకా కొనసాగుతోన్న నియంత్రణ ఒక్కసారే కట్టలు తెంచుకుంటుంది. ఇకపై అన్ని దేశాలూ పోటాపోటీగా పరీక్షలు నిర్వహిస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే..''అని ఐసీఏఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బెట్రీస్ ఫిన్ అభిప్రాయపడ్డారు. పోస్ట్ కథనం వెలుగులోకి వచ్చి గంటలు గడుస్తున్నా, దానిపై దుమారం చెలరేగుతున్నా వైట్ హౌజ్ మౌనంగా ఉండిపోవడంతో ‘అణు'అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో..
మళ్లీ కనిపించిన కిమ్..
హార్ట్ ఆపరేషన్ వికటించి ప్రాణాలు కోల్పోయాడంటూ పుకార్లు రేగిన తర్వాత నెల రోజులకుగానూ తళుక్కున మెరిసిపోయిన కిమ్ జాంగ్ ఉన్.. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత ఆదివారం మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. అమెరికాలో ట్రంప్ ఎలాగైతే ఆలోచించారో.. ఉత్తరకొరియా నియంత నేత సైటం అదే లైన్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు దేశరాజధాని ప్యోంగ్యాంగ్ లో ఉన్నతాధికారులతో కిమ్ సమావేశం తాలూకు ఫొటోలు, అందులో తీసుకున్న నిర్ణయాలను అధికారిక మీడియా ‘‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ)'' వెల్లడించింది.
ఆగిపోయిన శాంతి చర్చలు..
ఒక దశలో అమెరికాపై సైతం అణుబాంబులు వేస్తానంటూ తీవ్ర హెచ్చరికలు చేసిన ఉత్తరకొరియా.. శాంతి చర్చల కారణంగా వెనక్కి తగ్గడం తెలిసిందే. సింగపూర్, వియత్నాం వేదికలుగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, నార్త్ కొరియా నేత కిమ్ రెండు దఫాలుగా చర్చలు జరిపారు. కిమ్ తన అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తే... ఆయన దేశంపై కొనసాగుతోన్న ఆంక్షలను ఎత్తేస్తామని అమెరికా ఆఫర్ చేసింది. అయితే ముందే ఆంక్షలు ఎత్తేయాలని, ఆ తర్వాత ఆయుధాల్ని నిర్వీర్యం చేస్తానని కిమ్ మెలికపెట్టాడు. దీంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. ఈలోపు కరోనా వైరస్ ముంచుకురావడం.. చైనా-అమెరికాల మధ్య శతృత్వం పతాక స్థాయికి చేరడం, రష్యాతో ట్రంప్ టర్మ్స్ కూడా దాదాపు దెబ్బతినడం, సౌత్ కొరియా సైతం చొరవ తగ్గించడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మళ్లీ మిస్సైల్స్ మోత..
అమెరికాతో చర్చలు విఫలమైన నేపథ్యంలో అణ్వాయుధ కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించాలని అధినేత కిమ్ నిర్ణయించినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది. ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కిమ్ ఈమేరకు దిశానిర్దేశం చేశారని తెలిపింది. అయితే ఈ ప్రయోగాలు కేవలం ఆత్మరక్షణ కోసమేనని, ఇతరులను బెదిరించడానికి కాదని, అణ్వాయుధాల నిర్వీర్యానికి కిమ్ సర్వదా సిద్ధంగా ఉన్నారని నార్త్ జాతీయ మీడియా పేర్కొంది. కిమ్ తాజా నిర్ణయంతో మిస్సైళ్ల మొత మళ్లీ మొదలుకానుంది.