పెనుముప్పే, సహనం నశించింది: కిమ్ జోంగ్పై ట్రంప్ ఆగ్రహం, జపాన్ ఫుల్ సపోర్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సహనాన్ని పరీక్షిస్తోందంటూ మండిపడ్డారు.
టోక్యో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సహనాన్ని పరీక్షిస్తోందంటూ మండిపడ్డారు. ఇప్పటికే ఉత్తర కొరియా విషయంలో తమ సహనం నశించిందని, తగిన గుణపాఠం చెప్పకతప్పదని ట్రంప్ తేల్చి చెప్పారు.
ఇదే మా కానుక: ట్రంప్ను రెచ్చగొట్టేలా కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలు
కిమ్కు కళ్లెం వేయాల్సిందే..
ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ట్రంప్.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దూకుడుకు కళ్లెం వేసే విషయమై ఆ దేశ ప్రధాని షింజో అబేతో చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా వ్యూహాలకు జపాన్ మద్దతు పలికింది.
సహనం నశించింది..
‘ఉత్తరకొరియాపై సహనంగా ఉండే కాలం పోయింది. ఆ దేశ అణు పరీక్షలు.. యావత్ ప్రపంచానికి, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతకు పెను ముప్పు' అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
జపాన్ మద్దతు..
కాగా, ట్రంప్ వ్యాఖ్యలకు జపాన్ ప్రధాని అబే మద్దతు పలికారు. ఉత్తరకొరియా విషయంలో అమెరికా తీసుకునే నిర్ణయాలకు జపాన్ మద్దతిస్తుందని తెలిపారు. సైనిక పరంగా కూడా సాయం చేస్తుందని చెప్పారు.
ఇంటర్య్యూలో ట్రంప్ మరోలా..
ఇది ఇలా ఉంటే, అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. ఉత్తకొరియాతో తాను చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం గమనార్హం. ‘నేను ఎవరితోనైనా చర్చలు జరిపేందుకు సిద్ధమే. చర్చలు బలం లేదా బలహీనత అని నేను అనుకోవడం లేదు' అని అన్నారు. ఉత్తరకొరియా ప్రజలు గొప్పవారని, కానీ, వారు పాలనా అణచివేతకు గురవుతున్నారని అన్నారు.
బాంబు దాడులంటూ బెదిరింపులు..
కాగా, ట్రంప్ జపాన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో బాంబు దాడులకు పాల్పడతామంటూ ఉత్తర కొరియా బెదిరింపులకు గురిచేయడం గమనార్హం. షిగా ప్రాంతంలోని ఓ షిప్ కంపెనీకి ఈ రకమైన బెదిరింపులు వచ్చాయట. ఈ కంపెనీకి చెందిన సైట్ సీయింగ్ షిప్లో బాంబు పెట్టామని, మరో గంటలో పేలే అవకాశం ఉందని బెదిరించినట్లు జపాన్ మీడియా తెలిపింది. దీంతో అధికారులు ఆ షిప్ లోని 290 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. షిగా ప్రాంతంతో పాటు హిరోషిమా, ఒసాకా ప్రాంతాల్లోని డిపార్ట్మెంటల్ స్టోర్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది.