ట్రంప్ ఇలా కూడా మాట్లాడుతారా!, ఊహించి ఉండరు..
ఇరు దేశాల మధ్య శాంతి పరిష్కారం కూడా తప్పనిసరిగా లభిస్తుందని, ఇందుకు ట్రంప్ రాయభారమే పరిష్కార మార్గం అని చెప్పుకొచ్చారు.
వాషింగ్టన్: అమెరికా-ఉత్తరకొరియా మధ్య గత కొంతకాలంగా మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. అణ్వస్త్ర ప్రయోగానికి సిద్దపడితే వైమానిక దాడులు తప్పవని అమెరికా హెచ్చరిస్తుంటే.. దేనికైనా సిద్దమని ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీనికి ధీటుగా అమెరికా కూడా యుద్దానికి దారితీసే వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఇందుకు భిన్నంగా ట్రంప్ శాంతి మంత్రం జపించడం గమనార్హం. ఎప్పుడూ దుందుడుకుగా వ్యవహరించే ఆయన నోటి వెంట తొలిసారిగా సామరస్యపూర్వకం అన్న మాట వినబడింది. ఉత్తరకొరియాతో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరముందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య శాంతి పరిష్కారం కూడా తప్పనిసరిగా లభిస్తుందని, ఇందుకు ట్రంప్ రాయభారమే పరిష్కార మార్గం అని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొనే అవకాశం ఉండటంతో.. ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.
ఓవల్ కార్యాలయంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయం చెప్పారు. సైనిక పరమైన చర్యలే ప్రత్యామ్నాయం కాకుండా ఆర్థిక కార్యక్రమాలతోను ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరకొరియాతో రాయభారం నెరపడం కొంత సంక్లిష్టమే అయినప్పటికీ.. తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.