మీరు సాయం చేస్తే.. ఓకే! లేదంటే మేమే చూసుకుంటాం: చైనాకు ట్రంప్ హెచ్చరిక
ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను అడ్డుకోవడంలో చైనా కలిసి రాని పక్షంలో అమెరికాయే ఏకపక్షంగా ఆ సంగతి చూసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
వాషింగ్టన్: ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను అడ్డుకోవడంలో చైనా కలిసి రాని పక్షంలో అమెరికాయే ఏకపక్షంగా ఆ సంగతి చూసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఆఫ్ లండన్ కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఈ గురు, శుక్రవారాల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో జరగనున్న సమావేశానికి ముందు అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐక్యరాజ్యసమితి, అమెరికాతోపాటు పలు దేశాలు ఎంతగా వారిస్తున్నా.. ఉత్తరకొరియా మాత్రం బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలను ఆపడం లేదు.
గత ఏడాదిలో ఉత్తర కొరియా ఐదు అణు పరీక్షలు నిర్వహించింది. ఉత్తర కొరియాపై చైనా ప్రభావం చాలా ఉంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ చైనాను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేసినట్లు అర్థమవుతోంది. ''చైనా మాకు సాయపడితే అది ఆ దేశానికే మంచిది. అలా కానిపక్షంలో అది ఎవరికీ మంచిది కాదు..'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హాలే కూడా ఉత్తర కొరియా విషయంలో అమెరికా చైనా సాయం తీసుకుంటుందని చెప్పారు. ''ఉత్తర కొరియాను ఆపగల దేశం ఏదైనా ఉందంటే.. అది చైనా ఒక్కటే. అందుకే ఈ విషయంలో మేము చైనాపై ఒత్తిడి పెంచుతూనే ఉంటాం'' అని హాలే ఏబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో తొలిసారి చైనా అధ్యక్షుడితో జరగనున్న ముఖాముఖి సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉత్తర కొరియా పాత్రపైనే చర్చ జరగనున్నట్లు కూడా నిక్కీ హాలే వెల్లడించారు. అటు చైనా కూడా ఉత్తర కొరియా అణు పరీక్షలతో విసుగు చెందినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఆ దేశం నుంచి వచ్చే బొగ్గు దిగుమతులను నిలిపివేసింది. అయితే ఉత్తర కొరియా దూకుడును తగ్గించేందుకు చైనా తీసుకున్న ఈ చర్య ఏమాత్రం సరిపోదని అన్ని దేశాలూ అభిప్రాయపడుతున్నాయి.