ముస్లిం దేశాలపై ట్రంప్ ఉక్కుపాదం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం
ఇస్లామిక్ ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన సంతకం చేశారు.
వాషింగ్టన్: అమెరికాలోకి ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులను తగ్గించేందుకు, ఇస్లామిక్ ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన సంతకం చేశారు. ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలు తగ్గించేందుకు అక్కడి నుంచి వచ్చే వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించే విధంగా నిబంధనలు రూపొందించే ఆదేశాలపై ఆయన సంతకం చేశారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వారం రోజుల తరువాత తొలిసారి పెంటగాన్ కు వెళ్ళిన ట్రంప్ దీనిపై సంతకం చేశారు. ''ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకు అత్యంత క్లిష్టమైన నిబంధనలు తీసుకొస్తున్నా.. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేం అనుకోవడం లేదు...'' అని ఆ ఆర్డర్ పై సంతకం చేసిన అనంతరం ట్రంప్ వెల్లడించారు.
అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేయడాన్ని హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన చర్యగా వారు అభివర్ణిస్తున్నారు.
ఈ ఆర్డర్ ప్రకారం... వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు.
అలాగే అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమాన్ని కూడా కనీసం 120 రోజులపాటు ఆపేస్తారు. సిరియా వలసదారుల్లో క్రిస్టియన్లకు ప్రాధాన్యమివ్వనున్నారు. అమెరికాకు మద్దతిచ్చేవారు, అమెరికన్లపై అభిమానం ఉన్నవారే ఇక్కడికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.