ఇరాన్పై ఇంకా చల్లారని ప్రతీకారేచ్ఛ... అధ్యక్ష పదవి చరమాంకంలో ట్రంప్ సంచలన నిర్ణయాలు..?
అధ్యక్ష పదవి చరమాంకంలోనూ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు. జనవరి 20,2021తో ఆయన పదవీకాలం ముగియనుండటంతో.. ఆలోపే ఇరాన్ను మరోసారి దెబ్బకొట్టాలన్న భావనలో ఉన్నారు. ఈ మేరకు ఇటీవలే దేశ జాతీయ భద్రతా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇరాన్ ప్రధాన అణుకేంద్రంపై దాడికి అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. ఈ సంచలన విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెలుగులోకి తెచ్చింది.
ట్రంప్ ఓటమిని అంగీకరించి తీరాలి.. త్వరలోనే రియాలిటీ తెలుసుకుంటాడు : మాజీ భార్య ఇవానా
నటాంజ్పై దాడికి ప్లాన్...
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... గత గురువారం(నవంబర్ 12) అధ్యక్షుడు ట్రంప్.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్,కొత్తగా నియమితులైన డిఫెన్స్ సెక్రటరీ క్రిస్టఫర్ మిల్లర్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరాన్ ప్రధాన అణుకేంద్రం నటాంజ్పై దాడి చేసేందుకు అవకాశాలను పరిశీలించాలని కోరారు. అయితే అధికారుల నుంచి ట్రంప్ అభీష్టానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం కావడంతో చివరకు ఆయన వెనక్కి తగ్గారు.
వెనక్కి తగ్గక తప్పలేదు...
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్పై దాడి సమస్యలను మరింత జటిలం చేస్తుందని భద్రతా అధికారులు ట్రంప్కు వివరించారు. దాడి తర్వాత తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని... కాబట్టి ఆ ఆలోచన విరమించుకోవడమే మంచిదని సూచించారు. దీంతో ట్రంప్ ఎట్టకేలకు తన నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు వైట్ హౌస్ వర్గాలు విముఖత వ్యక్తం చేశాయి. నిబంధనలకు విరుద్దంగా ఇరాన్ ఇప్పుడు 12రెట్లు అధికంగా శుద్దిచేసిన యురేనియంను నిల్వ చేసిందని గత వారం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(IAEA) వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్ను కట్టడి చేయాలంటే దాడులతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు.
నాలుగేళ్ల పాలనలో ఇరాన్ పట్ల దూకుడుగా...
ట్రంప్ తన నాలుగేళ్ల పాలనలో ఇరాన్ పట్ల చాలా దూకుడుగా వ్యవహరించారు. బరాక్ ఒబామా హయాంలో ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని ట్రంప్ ఉపసంహరించుకున్నారు. ఇరాన్కు వ్యతిరేకంగా వాణిజ్య ఆంక్షలు కూడా విధించారు.ఇరాన్లో రెండో శక్తివంతమైన నేత,ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ)లో ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసీ సులేమానీ హత్య ట్రంప్ హయాంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఇరాక్లోని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా జరిపిన రాకెట్ దాడుల్లో ఖాసీం సులేమానీ మృతి చెందారు. ఇరాక్, దాని చుట్టుపక్కల దేశాల్లో అమెరికా దౌత్యవేత్తలు, సిబ్బందిపై దాడులకు సులేమానీ కుట్రలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో అమెరికా ఆయన్ను అంతమొందించింది.
Recommended Video
ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్...
సులేమానీ హత్య తర్వాత ఇరాన్ అమెరికాపై ప్రతీకారంతో రగిలిపోతోంది. ఒక దశలో అమెరికా ఎన్నికలను ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఇటీవలి ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఇరాన్... ట్రంప్ పాలన రాజకీయంగా,నైతికంగా క్షీణించిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొంది. కొత్తగా అధికారం చేపట్టబోయే అధ్యక్షుడు జో బైడెన్... గత మూడేళ్ల అనుభవాలు,పరిణామాలను గమనించి.. తమ పూర్వపు నిబద్దతను కొనసాగిస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ మౌసవి మాత్రం... బైడెన్ పాలసీ ట్రంప్ కంటే భిన్నంగా ఉండే అవకాశమేమీ ఉండదని పేర్కొనడం గమనార్హం.