అణుపరీక్షల కేంద్రం ధ్వంసం చేస్తా: మరో షాకిచ్చిన కిమ్ జాంగ్, తెలివైన నిర్ణయమని ట్రంప్
వాషింగ్టన్: దక్షిణ కొరియాతో చర్చలకు ముందు అణు పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా అణు పరీక్షల కేంద్రాన్ని ధ్వంసం చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
కిమ్ జాంగ్ ఉన్ నుంచి ఇది ఆసక్తికర ప్రకటనే. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో వచ్చే నెల 12వ తేదీన సింగపూర్లో కిమ్ జాంగ్ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ నెలాఖరులో విదేశీ మీడియా ఎదుటే అణు పరీక్షలు జరిపిన టన్నెల్ను పేల్చి వేయనున్నట్లు తెలిపారు. ఉత్తర కొరియా అణు ఆయుధాలు వదులుకుంటే ఆ దేశానికి అన్ని విధాలుగా తోడ్పడుతామని అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజు కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కిమ్ జాంగ్ ఉన్ నిర్ణయంపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తెలివైన నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్స్ అని ట్వీట్ చేశారు.