డొనాల్డ్ ట్రంప్కు ఘోర అవమానం: కలిసి వచ్చేందుకు నో చెప్పిన నేతలు, మేయర్
పిట్స్బర్గ్: ఇటీవల పిట్స్బర్గ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. తీవ్ర ఆందోళనల నడుమ పిట్స్బర్గ్ వెళ్లారు. చివరకు సొంత పార్టీ నేతలు కూడా ఆయనతో కలిసి వచ్చేందుకు నిరాకరించినా, నగరానికి రావొద్దని మేయర్ కోరినా, బాధిత కుటుంబము కలిసేందుకు విముఖత చూపినా వందలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసినా ట్రంప్ లెక్కచేయలేదు.
తన సతీమణి మెలానియాతో కలిసి మొండిగా పిట్స్బర్గ్కు వెళ్లారు. ఇద్దరూ పిట్స్బర్గ్లోని ఘటనాస్థలికి వెళ్లి మృతులకు నివాళులు అర్పించారు. వారితో పాటు కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు కుష్నర్ ఉన్నారు. దాడి నుంచి బయటపడిన రబ్బి మైయర్స్ను ట్రంప్ కలిశారు.
ఆయన ట్రంప్కు యూదుల ఆరాధన మందిరం చరిత్ర గురించి, దాడి జరిగిన తీరును తెలిపారు. పోలీసుల సాహసాన్ని ట్రంప్ కొనియాడారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు భద్రతా సిబ్బందిని పరామర్శించారు. దాడిలో మరణించిన డాక్టర్ రిచర్డ్ గాడ్ఫ్రే భార్యను కలిసి సానుభూతి తెలిపారు.
దాడిలో ప్రాణాలు కోల్పోయిన డేనియర్ స్టైన్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు ట్రంప్ ఆసక్తి చూపించారు. కానీ ఆ కుటుంబం అందుకు నిరాకరించింది. ఇరు పార్టీలకు చెందిన కాంగ్రెస్ సభ్యులు, ఇతర నేతలు ట్రంప్తో కలిసి పర్యటనలో పాల్గొనేందుకు నిరాకరించారు. నగర డెమోక్రటిక్ మేయర్ బిల్ పుడోటో కూడా ట్రంప్ను కలుసుకోలేదు. కౌంటీ ఎగ్జిక్యూటివ్ రిచ్ ఫిట్జెరాల్డ్ కూడా అధ్యక్షుడి వద్దకు వెళ్లబోరని మేయర్ కార్యాలయం తెలిపింది.
కాగా, గత వారం పిట్స్బర్గ్లోని యూదుల ప్రార్థనా మందిరం వద్ద ఓ వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పదకొండు మంది చనిపోయిన విషయం తెలిసిందే.