తోక వంకరే! ‘మోడీ చెబితే ట్రంప్ వినాలనుకుంటున్నారు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి జమ్మూకాశ్మీర్ అంశంపై స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య జమ్మూకాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి.. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ అంశం ద్వైపాక్షికమేనని, భారత్-పాక్ దేశాలే చర్చల ద్వారా శాంతికి కృషి చేయాలని సూచించారు.
పదే పదే చెబుతున్నా...
తాజాగా గురువారం మరోసారి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అమెరికా వ్యాఖ్యలు చేయడం భారత్కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. కాశ్మీర్ అంశం తమ అంతర్గత విషయమని పదే పదే భారత్ చెబుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాశ్మీర్ అంశం చాలా క్లిష్టమైందని, ఇరు దేశాలు కోరితే మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్ కోరడం లేదంటూ..
కాశ్మీర్ అంశాన్ని అమెరికా చాలా లోతుగా గమనిస్తోందని, ఈ విషయంలో తాము సంయమనం పాటిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వ సీనియర్ అధికారి మీడియాతో అన్నారు. అంతేగాక, ట్రంప్ ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారని చెప్పారు. అయితే, భారత్ మాత్రం మధ్యవర్తిత్వం విషయంలో ఎలాంటి అభ్యర్థన చేయడం లేదని అన్నారు.
మోడీ చెబితే..
అంతేగాక, ఈ వారం చివరలో ఫ్రాన్స్లో జరిగే జీ7 సమ్మేళనం సందర్భంగా ప్రధాని మోడీని డొనాల్డ్ ట్రంప్ కలుస్తారని చెప్పారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారో చెబితే ట్రంప్ తెలుసుకోవాలనుకుంటున్నారని అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.
శాంతి కోసం..
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాక్-భారత్ మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సంయమనం పాటించి సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ట్రంప్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మధ్యవర్తిత్వం పేరుతో భారత్కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు.