సౌత్ పసిఫిక్లో 7.7 తీవ్రతతో భూకంపం: సునామీ హెచ్చరికలు, భారీ అలలు, ఆ దేశాలు అప్రమత్తం
సిడ్నీ: సౌత్ పసిఫిక్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. కాగా, ఈ భారీ భూకంపం తర్వాత ద్వీప దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
న్యూ కాలిడోనియాలోని వావోకు తూర్పున 415 కిలోమీటర్లు (258 మైళ్ళు) 10 కిలోమీటర్ల లోతులో గురువారం తెల్లవారుజామున (బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత) భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
పలు తీరాలకు "ప్రమాదకర సునామీ తరంగాలు" ఉన్నాయని అమెరికా ప్రభుత్వం ఎన్డబ్ల్యూఎస్ పసిఫిక్ సునామి హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఫిజి, న్యూజిలాండ్, వనాటుల ద్వీప దేశాలకు అలల స్థాయి 0.3 మీటర్ల నుంచి ఒక మీటర్ వరకు తరంగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి వివరాలను వెల్లడించలేదు.
ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెట్రోరాలజీ కూడా ఒక ట్వీట్లో సునామీ సంభవించినట్లు ధృవీకరించింది. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి తూర్పున 550 కిలోమీటర్లు (340 మైళ్ళు) దూరంలో ఉన్న లార్డ్ హోవే ద్వీపానికి ముప్పు ఉందని హెచ్చరించింది.
న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తీరప్రాంతాల్లోని ప్రజలు వాటర్ ఫ్రంట్ల నుంచి దూరంగా ఉండమని ఒక ప్రకటన విడుదల చేసింది. '7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత న్యూజిలాండ్ తీరప్రాంతాలు తీరంలో బలమైన, అసాధారణమైన అలలు వస్తాయని భావిస్తున్నాం' అని విపత్తు సంస్థ తెలిపింది.
ప్రభావిత ప్రాంతాలలో న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి ఉత్తరం, ఆక్లాండ్కు తూర్పున గ్రేట్ బారియర్ ద్వీపం, దేశం తూర్పున తీరం ఉన్నాయి. కాగా, సునామి లేదా భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ప్రాధమిక నివేదికలు లేవు,.