టర్కీ బొగ్గు గనిలో భారీ పేలుడు: 205 మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీ పశ్చిమ ప్రాంతంలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 205 మంది కార్మికులు మృతి చెందారు. మరో 200 మంది గనిలోనే చిక్కుకుపోయారు. మంగళవారం బొగ్గు గనిలో కార్మికులు షిప్టులు మారుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టర్కీ ప్రధాన వాణిజ్య నగరం ఇస్తాంబుల్ పట్టణానికి 250 కిలో మీటర్ల దూరంలోని సోమా ప్రాంతంలో ఈ బొగ్గు గని ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 787 మంది కార్మికులు ఉన్నారని, గనిలో చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నామని టర్కీ మంత్రి తానేర్ ఈల్డీజ్ తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ విషపూరితమవ్వడంతో పేలుడు సంభవించిందని, ఈ పేలుడు కారణంగా విద్యుత్ సరఫరా యూనిట్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం మరింత తీవ్రమైందని చెప్పారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 88 మంది కార్మికులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 363 మంది కార్మికులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. గనిలో చిక్కుకుపోయిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సహాయక చర్యల కోసం అంబులెన్స్ వాహనాలు, హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.
కాగా, టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన అల్బేనియా పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రమాద ఘటన సమాచారంతో హుటాహుటిన సోమా ప్రాంతానికి తరలివెళ్లారు. దేశంలో జరిగిన అతిపెద్ద బొగ్గు గని ప్రమాదమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, మంగళవారం నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.