తెలివి తెల్లారింది : గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుందన్న ప్రశ్నకు రెండు లైఫ్ లైన్లు తీసుకుంది
Recommended Video
టర్కీ: మన దేశంలో అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కౌన్ బనేగా కరోడ్ పతి ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.. దాన్నే తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో టాలీవుడ్ మన్మదుడు నాగార్జున హోస్ట్గా చేశారు. అక్కడ అడిగే ప్రశ్నలు కొన్ని మరీ సిల్లీగా ఉంటే గేమ్ లెవెల్స్ పెరుగుతూ పోతున్నసమయంలో క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ సమయంలో సాధారణంగా ఎవరైనా లైఫ్ లైన్లు వినియోగించుకుంటారు. కానీ ఇక్కడ ఓ యువతి మాత్రం సిల్లీ ప్రశ్నకు ఒకటి కాదు రెండు లైఫ్ లైన్లు వినియోగించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన సగటు నెటిజెన్ నవ్వాపుకోలేక పోతున్నాడు.
ఇక విషయానికొస్తే... కౌన్ బనేగా కరోడ్పతి తరహాలోనే టర్కీ వెర్షన్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఆ గేమ్ హాట్ సీట్లో 26 ఏళ్ల సుఐహాన్ అనే యువతి కూర్చొంది. ఇస్తాంబుల్ నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేసుకున్నట్లు తనను తాను పరిచయం చేసుకుంది. పరిచయ కార్యక్రమం అయ్యాక ప్రశ్నల పర్వం ప్రారంభమైంది. అందులో ఆమె ఎదుర్కొన్న ప్రశ్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుందని..? ఆప్షన్స్ గా చైనా, ఇండియా, దక్షిణ కొరియా, జపాన్లు ఇచ్చారు.అంతే ఈ ప్రశ్నకు సుఐహాన్కు చెమటలు పట్టాయి. ఎక్కడుందో సమాధానం తెలియదు. చాలాసేపు తచ్చాడింది. ఆలోచించింది. చేయాల్సినవన్నీ చేసింది. చివరకు లైఫ్ లైన్కు వెళ్లింది.
అంతకంటే ముందు తనకు సమాధానం తెలుసన్న సుఐహాన్...కొంచెం డౌట్ ఉందని అందుకే ఆడియన్స్ పోల్కు వెళతానని చెప్పింది. అయితే ఇచ్చిన సమాధానాల్లో 51 శాతం మంది ఆడియెన్స్ చైనా అని సరైన సమాధానం ఇచ్చారు. మరికొందరు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇండియాలో ఉందని అనుకున్నారు. ఇక సగం మందే ఆడియెన్స్ చైనా అని చెప్పడంతో మరింత మీమాంసకు గురైంది సుఐహాన్. ఇక ఆలస్యం చేయకుండా ఫోన్ ఎ ఫ్రెండ్ ఆప్షన్ వినియోగించుకుంది. మొత్తానికి తన ఫ్రెండ్ చైనా అని సమాధానం చెప్పడంతో ఎలిమినేషన్ నుంచి సుఐహాన్ తప్పించుకోగలిగింది. కానీ నెటిజన్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతోంది. అయితే తదుపరి ప్రశ్నగా ఓ సాంగ్ను వినిపించగా దాని కంపోజర్ను చెప్పడంలో విఫలమవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది.