38,000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నాం
అంకారా: తిరుగుబాటు కుట్రదారులను జైల్లో వెయ్యడానికి 38 వేల మంది పాత నేరస్తులను వదిలి పెట్టాలని టర్కీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే వారిని షరతులపై విడుదల చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రెండేళ్ల కంటే తక్కువ శిక్ష పడిన వారిని పెరోల్ పై విడుదల చెయ్యాలని ప్రభుత్వం డిక్రీ జారీ చేసింది. హత్యలు, గృహహింస, అత్యాచారం, లైంగిక దాడులు, దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు, తీవ్రవాదులను విడుదల చెయ్యరాదని ప్రభుత్వం సూచించింది.
2016 జులై 1 తరువాత నేరం చేసి జైలుకు వచ్చిన వారిని విడుదల చెయ్యరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 38 వేల మంది ఖైదీలను విడుదల చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించిందని టర్కీ న్యాయశాఖ మంత్రి బెకిర్ బొజడాగ్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసేందుకు 2016 జులై 15వ తేదిన సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసింది. ప్రజల సహకారంతో తిరుగుబాటును టర్కీ ప్రభుత్వం తిప్పికొట్టింది. తిరుగుబాటుకు కారణం అయ్యారని టర్కీ ప్రభుత్వం 35 వేల మందిని అదుపులోకి తీసుకుంది.
35 వేల మందిని ప్రశ్నించిన తరువాత 17 వేల మందిని అరెస్టు చేశామని టర్కీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అరెస్టు అయిన వారిలో సైనికులు, పోలీసులు, న్యాయమూర్తులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారు. వీరిని జైల్లో పెట్టడానికి పాత నేరస్తులను వదిలిపెడుతున్నారు.