టర్కీ సైన్యం ఆధీనంలో బాగ్దాది కుటుంబం: సోదరి, భర్త, పిల్లలు సహా: ట్రాలీ కంటైనర్ లో..
వాషింగ్టన్: భయానక ఉగ్రవాద సంస్థ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాది ఆత్మహత్య చేసుకున్న అనంతరం మరో బిగ్ బ్రేక్ త్రూను సాధించాయి సైనిక బలగాలు. బాగ్దాది సోదరిని పట్టుకున్నారు.. సజీవంగా. ఆమె పేరు రస్మియా అవద్. వయస్సు 65 సంవత్సరాలు. రస్మియాతో పాటు ఆమె భర్త అయిదుమంది పిల్లలను టర్కీ సైనికులు పట్టుకున్నారు.
వారిని తమ అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. రస్మియా అవద్ ను సజీవంగా పట్టుకోవడం పట్ల గోల్డ్ మైన్ లాంటి విషయమని టర్కీ సైనిక ప్రతినిధి తెలిపారు. ఆమె ద్వారా ఐసిస్ నెట్ వర్క్ మొత్తాన్నీ వెలికి తీయవచ్చని చెప్పారు.
టర్కీలో ఐసిస్ ఆధిప్యాన్ని కొనసాగించిన ఇడ్లిబ్ ప్రావిన్స్ లోని అజాజ్ పట్టణంలో టర్కీ సైనికులు మెరుపుదాడి చేశారు. ప్రతి ఇంటినీ సోదా చేశారు. ఈ దాడుల సందర్భంగా రస్మియా అవద్, ఆమె భర్త, అయిదుమంది పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. దశాబ్దాల కాలంగా వారు ఓ ట్రాలీ కంటైనర్ లో జీవనాన్ని కొనసాగిస్తున్నారని టర్కీ సైనిక ప్రతినిధి వెల్లడించారు.
సిరియాకు చెందిన కుర్దీష్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. రస్మియా అవద్ ను విచారించడం ద్వారా ఐసిస్ నెట్ వర్క్ మొత్తాన్ని కూపీ లాగడానికి అవకాశం దొరికినట్టయిందని అన్నారు.
అబు బాకర్ అల్ బాగ్దాది ఆత్మహత్య తరువాత ఐసిస్ చెదిరిపోయిందని, కొంతమంది కీలక నాయకులు కూడా హతం కావడం వల్ల నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. కిందటి నెల 24వ తేదీ అమెరికా సైనిక బలగాలు సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ లో నిర్వహించిన దాడుల సమయంలో బాగ్దాది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
బాగ్దాది తలదాచుకున్న బార్షియా గ్రామంలో ఉన్న ఆయన స్థావరాన్ని చుట్టు ముట్టిన తరువాత తప్పించుకోవడానికి మరో మార్గం లేకపోవడంతో బాగ్దాది తనను తాను పేల్చేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అతని మృతదేహాన్ని సముద్రంలో గుర్తు తెలియని చోట పాతిపెట్టారు అమెరికా సైనికులు.