హిమాలయన్ కంట్రీని వణికించిన జంట భూకంపాలు: 20 నిమిషాల వ్యవధిలో: 2015 నాటి ఉత్పాతం
ఖాట్మండు: హిమాలయన్ కంట్రీ నేపాల్ను జంట భూకంపాలు నిలువెల్లా వణికించాయి. 2015 నాటి ఉత్పాతాన్ని గుర్తుకు తెచ్చాయి. ఈ రెండు భూకంపాల తీవ్రత మధ్య స్థాయిలో ఉండటం, దీని ప్రభావం జనావాసాలపై పడకపోవడం వల్ల నేపాలీయులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ జంట భూకంపాల వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు వెలువడలేదు. అయినప్పటికీ.. ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను సన్నద్ధం చేసింది.
రాజధాని ఖాట్మండూకు పశ్చిమ దిశగా 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధడింగ్ ప్రాంతంలో శనివారం రాత్రి 9:36 నిమిషాలకు తొలి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైనట్లు జాతీయ సెస్మలాజికల్ సెంటర్ ఆదివారం ఉదయం వెల్లడించింది. 20 నిమిషాల తరువాత రెండోసారి కూడా అదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.2గా నమోదైనట్లు పేర్కొంది. హిమాలయ పర్వత పంక్తులతో కూడుకుని ఉండటం వల్ల దాని ప్రభావం పెద్దగా కనిపించలేదని అంటున్నారు.
అంతకుముందు దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా జంట భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలోని గుర్గావ్ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఆ మరుసటి రోజే నేపాల్లో అదే తరహాలో జంట భూకంపాలు నమోదు కావడం ఆందోళనకు దారి తీస్తోందని అంటున్నారు. రాబోయే ఉత్పాతానికి ఇది ఏదైనా సంకేతమా అనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
2015లో నేపాల్లో పెను భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నాటి ఘటనలో తొమ్మిది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సరిగ్గా అయిదేళ్ల తరువాత మరోసారి జంట భూకంపాలు సంభవించడం నేపాలీయులను ఉలిక్కిపడేలా చేసింది. నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకుని వణికిపోయారు. తాజా భూకంపాల తీవ్రత ఆ స్థాయిలో లేకపోవడం వారికి ఊరట కలిగించింది.