గంటల వ్యవధిలో రెండు భూకంపాలు: సునామీ భయంతో వణికిన జపాన్!
టోక్యో: రెండు పెను భూకంపాలు జపాన్ను వణికించాయి. కొన్ని గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 10:43 నిమిషాలకు తొలి భూకంపం సభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. మరో భూకంపం శుక్రవారం ఉదయం 7:43 నిమిషాలకు చోటు చేసుకుంది. దీని తీవ్రత 6.3గా రికార్డయ్యింది. సముద్రంలో భూకంపం సంభవించడం వల్ల సునామీ ముప్పు ఉంటుందని తొలుత అనుమానించారు. దాని తీవ్రత సునామీని సృష్టించే స్థాయిలో లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు.
అయ్యా బాబోయ్.. 42 కోట్ల జరిమానా.. ఎందుకో తెలిస్తే షాక్..!
రాజధాని టోక్యోకు నైరుతి దిశగా సముద్రంలో 35 కిలోమీటర్ల లోతులో తొలి భూకంపం సంభవించిందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రెండో భూకంపం కూడా అదే ప్రాంతంలో చోటు చేసుకుందని, సముద్రంలో 44 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు వెల్లడైంది. దీని ప్రభావం తీర పట్టణం మియాజకీ-షిపై పడింది. ఈ పట్టణంలో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి.
రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండటం వల్ల జపాన్కు భూకంపాలు కొత్తేమీ కాదు. సముద్రంలో సంభవించడం వల్ల సునామీ ముప్పు ఉండొచ్చంటూ భయాందోళనలు వెల్లువెత్తాయి. తీర ప్రాంత ప్రజలను వణికించాయి. 2011లో 9.1 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం ఎలాంటి ఉపద్రవాన్ని సృష్టించిందో ప్రపంచ దేశాలు ఎప్పటికీ మరిచిపోలేవు. అత్యంత శక్తిమంతమైన సునామీకి కారణమైందా భూకంపం. వేలాదిమందిని పొట్టనబెట్టుకుంది. అధికారిక లెక్కల ప్రకారం 15 వేల మంది మరణించారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.