డొనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ అనూహ్య షాక్... శాశ్వత నిషేధం విధించిన సోషల్ మీడియా దిగ్గజం...
అధ్యక్ష పదవి చరమాంకంలో అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ అనూహ్య షాకిచ్చింది. ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నుంచి శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్ అధికార మార్పిడికి అంగీకరించినప్పటికీ.. తన వ్యాఖ్యలు,సందేశాలతో మరింత హింసను రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్న కారణంతో ఈ చర్యకు పూనుకుంది. గత కొద్దిరోజులుగా ట్రంప్ చేస్తున్న ట్వీట్లు,వాటి పర్యవసానాలు పరిశీలించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేసింది.
Recommended Video
మద్దతుదారులను రెచ్చగొడుతున్న ట్రంప్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి తర్వాత 12గంటల పాటు ట్విట్టర్ ఆయన ఖాతాలను స్తంభింపజేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన వీడియోతో పాటు మూడు ట్వీట్లను ట్విట్టర్ నిలిపివేసింది. ట్రంప్ వ్యాఖ్యలు,ఆయన సందేశాలపై ప్రధాన స్రవంతి మీడియా నియంత్రణ పాటిస్తున్నప్పటికీ... సోషల్ మీడియా ద్వారా ఆయన తన 90మిలియన్ల మంది ఫాలోవర్స్ను రెచ్చగొడుతున్నారు. దీంతో ట్విట్టర్ కఠిన చర్యలకు పూనుకోవాల్సిందేనని చాలామంది విమర్శకులు డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు ట్విట్టర్ నుంచి ట్రంప్కు షాక్ తప్పలేదు.
ట్విట్టర్ అధికారిక వివరణ
ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధించడంపై ఆ సంస్థ అధికారిక వివరణ ఇచ్చింది.ట్రంప్ చేసిన చివరి రెండు ట్వీట్లు తమ పాలసీకి పూర్తి విరుద్దంగా ఉన్నాయని పేర్కొంది. ఇందులో ఒక ట్వీట్లో తాను బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరుకానవట్లేదని ట్రంప్ ప్రకటించారు. అలాగే తన మద్దతుదారులైన 75మిలియన్ల మందిని గొప్ప అమెరికా దేశభక్తులుగా అభివర్ణించిన ట్రంప్... ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఎలాంటి గౌరవ భంగం జరగకూడదని మరో ట్వీట్లో వ్యాఖ్యానించారు. ఈ రెండు ట్వీట్ల ద్వారా ఆయన పరోక్షంగా తన మద్దతుదారులను హింస రెచ్చగొట్టారు.
ఫేస్బుక్ సంగతేంటి?
మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా ట్రంప్ ట్విట్టర్ ఖాతాలపై తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. జనవరి 20న జో బైడెన్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టేంతవరకూ ట్రంప్ ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ ఖాతాలను స్తంభింపజేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. తాజాగా ట్విట్టర్ ట్రంప్ ఖాతాపై పూర్తి నిషేధం విధించడంతో ఫేస్బుక్ కూడా ఆ దిశగా ఆలోచిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.